యాదాద్రి భువనగిరి, మే 20 (నమస్తే తెలంగాణ): యా దాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల నిధులు స్వాహా అయ్యాయి. బ్యాంకర్లు, అధికారుల అలసత్వంతో ఆర్పీల ద్వారా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారు. ఒక్క భువనగిరి మున్సిపాలిటీలోనే 38 నకిలీ సంఘాల పేరుతో సుమారు రూ. 6.26 కోట్లు దుర్వినియోగం చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో 1200 స్వయం సహాయక సం ఘాలు ఉన్నాయి. మెప్మా ద్వారా రుణాలు తీసుకొని.. తిరిగి చెల్లిస్తారు. ఇందుకోసం పలు నిబంధనలు పాటించాల్సి ఉం టుంది.
ముఖ్యంగా బ్యాంకులో మైక్రో క్రెడిట్ పాలసీ(ఎంసీపీ)ని అమలు చేయాలి. డాక్యుమెంట్లను భువనగిరిలోని కెనెరా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఎంసీపీ నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రుణాలు ఇచ్చా రు. సంఘం సభ్యుడి ఖాతాల్లో కాకుండా సంఘం ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో దుర్వినియోగానికి మరింత అవకాశం దొరికింది. సరైన డాక్యుమెంట్లు, సంతకాలు, వ్యక్తులు లేకున్నా బ్యాంకులు అప్రూవ్ చేశాయి. సంఘాల్లో సభ్యులు లేకున్నా.. గ్రూపుల్లో లేని వ్యక్తుల ఆధార్ కార్డులతో రుణాలు తీసుకున్నారు.
ఒకే వ్యక్తి ఆధార్ కార్డును రెండు, మూడు సా ర్లు జత చేశారు. పది రోజుల్లో ఏర్పాటైన సంఘాలకు కూ డా లోన్లు ఇచ్చారు. ఇలా భువనగిరి మున్సిపాలిటీలో 38 సంఘాలు ఉండగా, 2023 నుంచి ఇప్పటి వరకు రూ. 6,26,53,383 నిధులు దుర్వినియోగమయ్యాయి. వీటిని ఆర్పీలు సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. బిందు అనే ఆర్పీ రూ. 2.30 కోట్లు, దివ్య అనే ఆర్పీ రూ. 3.54 కోట్లు, సిరియాల అనే ఆర్పీ రూ.27లక్షలు, స్వరాజ్యలక్ష్మి రూ.15 లక్షల చొప్పున స్వాహా చేశారు. మొత్తం 1.5 కోట్లు మాత్రమే చెల్లించడం కొసమెరుపు.
బయటపడింది ఇలా..
మున్సిపాలిటీలో రుణాలు తీసుకోకున్నా కొందరికి ఇటీవల బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. దీంతో అవాక్కయిన సభ్యులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తాము అసలు డబ్బులే తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూపీ లాగితే డొంకంతా కదిలింది. ఈ విషయంలో నలుగురు ఆర్పీలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మున్సిపాలిటీలో తొలుత అధికారులు ఆడిటింగ్ చేశారు. అవకతవకలు పాల్పడ్డారనే విషయం తేలడంతో లోతుగా విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో ఆర్పీలతోపాటు బ్యాంకు సిబ్బంది, మెప్మా అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.