మిర్యాలగూడ, నవంబర్ 30 : మిర్యాలగూడ నియోజకవర్గంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. 9 గంటలకు 6.6 శాతం, 11 గంటలకు 21.06శాతం నమోదవగా, ఒంటి గంటకు 39.21, 3 గంటలకు 59.12, 4 గంటలకు 65.1, 5 గంటలకు 77.52 శాతంగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు దీరి ఉండగా వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. నియోజకవర్గంలో మొత్తం 2,31,391 ఓటర్లు ఉండగా 83.18 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణంలోని బంగారుగడ్డలోగల మాడిసన్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో సుమారు 30 నిమిశాలపాటు ఈవీఎంలు మొరాయించగా అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీ డౌహిల్ స్కూల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మినా ఇంజినీరింగ్ కళాశాలలో ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి హౌసింగ్బోర్డు కాలనీలోని చైతన్యస్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి సాధినేని శ్రీనివాస్రావు హౌసింగ్బోర్డు కాలనీలోని 44వ వార్డులో ఓటు వేశారు.
మిర్యాలగూడ రూరల్ : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ ముమ్మరంగా, సజావుగా సాగింది. ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు. ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు సొంత వాహనాలపై స్వగ్రామం చేరుకొన్నారు. యువత, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిల్చున్నారు.
దామరచర్ల : మండలంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాలల్లో ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే బారులు దీరారు. మధ్యాహ్నం తరువాత పోలింగ్ కేంద్రాలకు జనం భారీగా తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దాంతో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యువత, మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ్థ, చైతన్యలు అన్ని పోలింగ్ కేంధ్రాలను పరిశీలించి ఓటింగ్ సరళనీ తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులను వీల్చైర్లల్లో పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. వాడపల్లి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.