మిర్యాలగూడ, జనవరి 24: సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టి.సాగర్ కోరారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సాగర్ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో రైతులు వరి సాగు చేశారని, సాగు నీరు విడుదలవుతుందన్న ఆశలో మరికొందరు బోర్లు, బావుల కింద సాగు చేశారని మంత్రికి తెలిపారు. సాగర్ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పది రోజులపాటు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని, అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించి పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని విన్నవించారు. స్పందించిన మంత్రి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి వెంట సంఘం నాయకులు శోభన్, బసవయ్య తదితరులు ఉన్నారు.