భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : అత్యాధునిక వసతులతో యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపట్టి రాష్ట్రంలో యువత భవితకు బంగారు బాటలు వేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నా రు. సచివాలయంలోని తన కార్యాలయంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి, క్రీడా శాఖ అధికారులతో రాయగిరి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం, కాంప్లెక్స్ నిర్మాణ పురోగతిపై శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్టేడియానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించిన మంత్రి.. అత్యాధునిక వసతులతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్రం నుంచి తగిన నిధులు సమీకరించేందుకు రెండు మూడు రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్టేడియం నిర్మాణానికి నిధులు తీసుకొచ్చేలా కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్తో మాట్లాడుతానని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ శంకరయ్య, స్పోర్ట్స్ అథారిటీ డీఈ అశోక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనుంజయ పాల్గొన్నారు.