రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం సాయంత్రం తన సొంత గ్రామం నాగారంలో ఓ కార్యక్రమానికి హాజరై ఊరంతా కలియ తిరిగారు. వాడవాడకు వెళ్లి అవ్వ, తాతలను ఆత్మీయంగా పలుకరించారు. తనకు చిన్న తనంలో బట్టలు కుట్టిన లక్ష్మమ్మ, తనను ఎత్తుకొని తిప్పిన
రాములును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బంధువులు, మిత్రులతో మాట్లాడి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మంత్రి హోదా మరిచి అందరితో చనువుగా మాట్లాడడంతో గ్రామస్తులు పరవశించి పోయారు. ఈ సందర్భంగా పలువురి కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు ఇండ్లు మంజూరు చేస్తానని మంత్రి భరోనిచ్చారు.
నాగారం, ఏప్రిల్ 24 : పుట్టిన ఊరి మీద మమకారం.. సొంతూరి వారికి అభిమానంతో సోమవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాగారంలో కలియ తిరిగారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేస్తూ.. గ్రామస్తులను ఆత్మీయంగా పలుకరిస్తూ మంత్రి కాలినడకన ముందుకు సాగగా.. గ్రామస్తులు పరవశించి పోయారు. ఇటీవల ప్రమాదానికి గురై మృతి చెందిన బొబ్బిలి శివకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఇద్దరు పిల్లల పేరు మీద సొంతంగా చేరో లక్ష రూపాయలు ఫిక్స్డ్ చేశారు. శివకుమార్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు బొబ్బిలి గట్టయ్య దంపతులకు చెరో ఇల్లు మంజూరు చేయించారు. వృద్ధాప్యంలో ఉన్న గట్టయ్య దంపతులకు పోషణ నిమిత్తం నెలకు చెరో ఐదువేలు సొంతంగా అందిస్తానని మంత్రి ఇచ్చిన హామీ వారి కళ్లల్లో వెలుగులు నింపాయి. పసి ప్రాయంలో తనను ఎత్తుకొని తిరిగిన శీలం రాములు కుటుంబానికి పోషణ నిమిత్తం నెలకు ఐదు వేలు అందిస్తానని, వారికి ఇల్లు మంజూరు చేయిస్తానన్న మంత్రి హామీ ఇచ్చారు. అనారోగ్యంతో మృతి చెందిన చిప్పలపల్లి శ్రీను కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఇల్లు మంజూరు చేయించి నేనున్నానంటూ మంత్రి చూపిన ఔదర్యానికి వారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఊరు ఊరంతా కలియ తిరిగిన మంత్రి, తనకు చిన్న తనంలో బట్టలు కుట్టిన కీర్తి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. తనను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన రాములును గుర్తుంచుకొని మరీ అండగా ఉంటామంటూ చెప్పిన మాటలు గ్రామస్తులకు తియ్యటి అనుభూతిని పంచింది.
పల్లె ప్రకృతి వనాలతో పెరిగిన పచ్చదనం : మంత్రి జగదీశ్రెడ్డి
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం పెంపొందిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నాగారం మండలకేంద్రంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. పల్లెలు పాడి పంటలతో పసిడి సిరులతో చెరువులు మత్తడి దుంకుతూ కలకలలాడుతున్నాయన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మంత్రి వెంట తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, సీనియర్ నాయకులు చిప్పలపల్లి సోమయ్య, గ్రామశాఖ అధ్యక్షులు ఎలక సైదులు, వీరగాని రమేశ్, అనంతుల వెంకన్న, గంట నరసయ్య, దేవరకొండ మురళి, మధు, పరశురాములు, పండు పాల్గొన్నారు.