‘మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నది. సామాన్య ప్రజలను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతుంటే కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాదిరిగా దేశంలో ఆకలి చావులు పెరిగాయి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నావికుడు లేని నావలా తయారైందన్నారు. మోదీ అరాచక, విభజన రాజకీయాలను ఎదుర్కొనే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉందని భారత ప్రజలంతా నమ్ముతున్నారని, అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీ దురాగతాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
రామన్నపేట, మార్చి 21 : సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రామన్నపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నదన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాదిరిగా దేశంలో ఆకలి చావులు, దారిద్య్రం పెరిగిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో బీజేపీ నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. మోదీ అరాచక, విభజన రాజకీయాలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నావికుడు లేని నావగా మారిందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యలే తమ సమస్యలుగా భావించి అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉన్నదన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. సకల జనుల బలంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, దానికి ఇతర రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ బీడు భూములను సాగులోకి తీసుకొచ్చారన్నారు. పట్టణంలో రూ.8.5 కోట్లతో సెంట్రల్ లైటింగ్తోపాటు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా రామన్నపేట మండలంలో 22వేల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. 1,650 మందికి కల్యాణలక్ష్మి, 60 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందిందని, 650 మందికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. 7,800 మందికి నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. నాలుగేండ్లలో గ్రామాల అభివృద్ధికి కోటికి పైగా నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు కానున్నాయని, ముఖ్యమంత్రిని ఒప్పించి మరో వెయ్యి ఇండ్లు తీసుకొస్తానని అన్నారు.
నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్త తేడా లేకుండా గులాబీ జెండా పట్టుకొని అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. మన ముందు నిలబడే ధైర్యం బీజేపీకి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. బీజేపీలో చేరితే కేసులు ఉండవని.. ఈడీ, సీఐడీ, ఐటీ దాడుల పేరుతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దుర్మార్గమైన పాలన అందిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యామండలి డైరెక్టర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 8 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కక్షగట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ.14లక్షల కోట్ల స్కాం చేసిన అదానీకే మోదీ ప్రభుత్వం మద్దతు పలుకుతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు గుత్తా నర్సింహారెడ్డి, ఎడ్ల మహేందర్రెడ్డి, తిమ్మాపురం మహేందర్రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, రేఖ యాదయ్య, కాటేపల్లి సిద్ధమ్మాయాదయ్య, నీల జయమ్మా దయాకర్, ముత్యాల సుజాతారవి, కడమంచి సంధ్యాస్వామి, దోమల సతీశ్, మెట్టు మహేందర్రెడ్డి, ఏనుగు పుష్ప వెంకట్రెడ్డి, గొరిగే నర్సింహ, వేమవరపు సుధీర్బాబు, గాదె పారిజాత, కోళ్ల స్వామి, ధర్నె రాణి, బందెల యాదయ్య, చెరుకు సోమయ్య పాల్గొన్నారు.
పండుగలా ఆత్మీయ సమ్మేళనం
రామన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో సాగింది. మండలంలోని 24 గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు, మహిళలు, స్వచ్ఛందంగా తరలివచ్చారు. యువకులు పెద్దఎత్తున బైకులపై వచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. పటాకులు పేల్చి, డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ యువత సందడి చేశారు. సమ్మేళనంలో ప్రభుత్వ పథకాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించగా ఆసక్తిగా విన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే వేస్తామని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడతామని చెయ్యి ఎత్తి జైకొట్టారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.