మాట నిలబెట్టుకున్న మహామనిషి
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే మడమ తిప్పని విధంగా నెరవేర్చి తీరుతారు. వాసాలమర్రితో ఇది మరోసారి నిరూపితమైంది. వాసాలమర్రిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందులో భాగంగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అనేక సార్లు స్వయంగా పర్యటించారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించి అమలు చేశారు. ఊర్లో ఉన్న దళితులందరికీ దళితబంధు ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. దీంతో అతి త్వరలోనే గ్రామం రూపురేఖలు మారనున్నాయి. నిధుల మంజూరుపై గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి
ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఇతర జిల్లా అధికారులు వాసాలమర్రిని సందర్శించి పలు చోట్ల స్థలాలను పరిశీలించారు. భవన నిర్మాణాల కోసం ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరులోగా భవనాల నిర్మాణాల కోసం టెండర్ ప్రక్రియ పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. మే మొదటి వారం నుంచే నిర్మాణాలు ప్రారంభించేలా పనులు వేగిరం చేస్తున్నారు. మే ఆఖరి వరకు పనులు 30 నుంచి 40శాతం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. కాగా, హెల్త్ సబ్ సెంటర్, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కొండాపూర్ రోడ్డులో గతంలో తొలగించిన హాస్టల్ స్థలంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఇప్పుడున్న చోటనే నిర్మించనున్నారు. అక్కడే రెండో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. రామ్శెట్టిపల్లిలో గతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్దనే కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.
ఇప్పటికే ఎస్సీలందరికీ దళిత బంధు
దళితోద్ధరణ కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోనే వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. దీంతో గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలకు రూ.10లక్షల సాయం అందింది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు తోడ్పాటుతో ఇప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. కిరాణం, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, టీ కప్పుల తయారీ, డయాగ్నోస్టిక్స్, సెంట్రింగ్ తదితర బిజినెస్లు ఏర్పాటు చేసుకొని సక్సెస్ అవుతున్నారు. స్కీం వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రపంచమే గర్వించేలా నెలకు రూ.30 నుంచి 40వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
వాసాలమర్రి దశ మారుతుంది..
మా నియోజకవర్గంలోని వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ గ్రామ ప్రజలు ఎంతో అదృష్టవంతులు. అభివృద్ధి, ఇతర పనుల కోసం నిధుల మంజూరు కావడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక వాసాలమర్రి దశ దిశ మారుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. సకల సదుపాయాలు సమకూరుతాయి. ఇప్పటికే రోడ్ల పనులు నడుస్తున్నాయి. ఊరంతా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి. వాసాలమర్రి రాష్ట్రంలోనే మోడల్ విలేజ్గా మారుతుంది.
– గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే