సూర్యాపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో 25 ఏండ్ల క్రితం కొందరు కూలీలు గుడిసెలు వేసుకొని సుందరయ్య కాలనీగా పేరు పెట్టుకొని జీవనం సాగించేవారు. వారికి కనీస సౌకర్యాలు లేకుండే. ఇండ్ల పట్టాలివ్వాలని నాటి సమైక్య పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు తీర్చేందుకు ముందుకు వచ్చారు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి. రోడ్లు, మురుగు కాల్వలు తదితర మౌలిక వసతులు కల్పించారు. పక్కా ఇండ్ల కోసం 58 జీఓ ప్రకారం దరఖాస్తులు స్వీకరించి పట్టాలు అందించారు. ఇప్పటికి 95 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వగా మరో 45 మందికి త్వరలో రానున్నాయి. వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన మంత్రి జగదీశ్రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేండ్లు తమ జాగాలు దక్కుతయో లేదోనని ఆందోళన చెందామని, సర్కారు ఇచ్చిన పట్టాతో 7లక్షల రూపాయల స్థలం సొంతమైందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
గజం జాగా లేని నిరుపేదలు సుమారు 25 ఏండ్ల క్రితం సూర్యాపేట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో పూరి గుడిసెలు వేసుకొని సుందరయ్యనగర్గా నామకరణం చేసుకున్నారు. నాటి నుంచి ఆ స్థలానికి పట్టాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనికరించలేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన పర్యటనలో భాగంగా గుడిసెల ప్రాంతానికి వెళ్లగా.. తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని నిరుపేదలు తమ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన మంత్రి న్యాయం చేస్తానని, కాస్త ఆలస్యమైనా కచ్చితంగా పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన మంత్రి.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 58 ప్రకారం 95 కుటుంబాలకు సర్వ హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలను ఇటీవల పంపిణీ చేశారు. త్వరలోనే మరో 45 మందికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 25 ఏండ్ల కల నెరవేరడంతో సుందరయ్య నగర్ కాలనీవాసులు సంతోషంతో సంబురపడుతున్నారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో మంత్రి జగదీశ్రెడ్డి వందల కోట్లు తీసుకురావడం ద్వారా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు తీరి పోతున్నాయి. సూర్యాపేటతోపాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేపడుతున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్రెడ్డి దశాబ్దాల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలను ఏడాది, రెండేండ్లలోనే పరిష్కరించారు. సాగర్ ఎడమ కాల్వపై కూలిపోయిన దోసపహాడ్ బ్రిడ్జిని ఏడాదిలోపే నిర్మించారు. మూసీ ఆధునీకరణ, ఎవరూ ఊహించని విధంగా ఉదయ సముద్రం నుంచి మూసీకి కృష్ణా జలాలు తెచ్చి సూర్యాపేట ప్రజలకు మురుగు నీటి పీడను దూరం చేశారు. పెన్పహాడ్ మండలం భక్తళాపురం వద్ద ఎస్సారెస్పీ కాల్వకు టన్నెల్ తవ్వించడం వంటివి ఎన్నో చేపట్టారు. ఇదిలావుండగా.. 25 ఏండ్లుగా పాలకులు, అధికారులు అనేక కొర్రీలు పెడుతూ నిరుపేదలు వేసుకున్న చిన్నపాటి గుడిసెలకు పట్టాలు ఇవ్వలేదు. కానీ.. నాలుగైదేండ్ల క్రితం మంత్రి జగదీశ్రెడ్డి ఆ కాలనీకి వెళ్లిన సమయంలో కాలనీవాసుల గోడును అడిగి విని ఆ వెంటనే కాలనీలో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేయించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు అధికారులతో మాట్లాడి 58 జీఓ కింద దరఖాస్తులు పెట్టించి ఇటీవల వారికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
మేము నిరుపేదలం. ఉండేందుకు ఇల్లు లేక 25 ఏండ్ల కింద సుందరయ్యనగర్లో గుడిసెలు వేసుకున్నాం. పట్టాల కోసం అటు తిరిగి ఇటు తిరిగి వ్యయ ప్రయాసలు పడ్డా ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నేండ్లు ఎన్నో పోరాటాలు చేసినం. ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగినం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నడూ పది వేల రూపాయలు కళ్ల చూడని మాకు మంత్రి జగదీశ్రెడ్డి పట్టాలిచ్చి రూ.7లక్షల విలువ చేసే ఇంటి స్థలంపై హక్కులు కల్పించిండ్రు. ఈ పట్టాతో బ్యాంకులో రుణం తీసుకొని ఇల్లు కట్టుకుంటాం. జీవితాంతం రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి అండగా ఉంటాం.
– చింత సునీత, సుందరయ్యనగర్, సూర్యాపేట
25ఏండ్ల కిందట సుందరయ్యనగర్ ప్రాంతమంతా అడవి. మాకు ఉండేందుకు ఇల్లు లేక చదును చేసుకొని గుడిసె వేసుకున్నాం. కొద్ది రోజులకు అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి ఖాళీ చేయమన్నారు. మాకు ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో ఏదైతే అదైతదని ఇక్కడే పడి ఉన్నాం. అధికారులు వచ్చినప్పుడు నాయకులతో కలిసి పోరాటం చేసినం. పట్టాలు కావాలని నెత్తి నోరు బాదుకున్నాం. కానీ.. పట్టాలు ఇచ్చేందుకు ఎవరికీ మనసు రాలేదు. మంత్రి జగదీశ్రెడ్డి పెద్ద మనసుతో మాకు పట్టాలిచ్చి 25 ఏండ్ల నిరీక్షణను ఫలింపజేసిండ్రు. ఆయనకు మా జన్మాంతం రుణపడి ఉంటాం.
– నవిలె మల్లమ్మ, సుందరయ్యనగర్, సూర్యాపేట
సుందరయ్య నగర్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలంతా కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారే. అటువంటి వారికి మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో రూ.7లక్షల నుంచి 9లక్షల రూపాయల విలువ చేసే ప్లాట్లు దక్కాయి. బ్యాంకు రుణంతోపాటు కూలి చేసి అంతో ఇంతో కూడబెట్టుకున్న సొమ్ముతో ఇంటిని నిర్మించుకుంటామని లబ్ధిదారులు సంతోషంగా చెప్తున్నారు. 25 ఏండ్లుగా తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి జగదీశ్రెడ్డి న్యాయం చేశారని చెప్పారు. ఇండ్ల పట్టాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి జీవితాంతం అండగా ఉంటామంటున్నారు.
25 ఏండ్ల క్రితం ఉండడానికి ఇల్లు లేక గుడిసెలు వేసుకున్నాం. నాటి నుంచి ఆ భూమిపై హక్కులు కావాలని, కాలనీలో సౌకర్యాలు కల్పించాలని ఎంతో మంది నాయకులను, అధికారులను వేడుకున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి పోరాడి పోరాడి అలసిపోయాం తప్ప.. ఒక్క నాయకుడూ కనికరించలేదు. ప్రభుత్వ భూమే కదా.. ఉన్నదంతా పేదలే కదా ఇద్దామని ఒక్కరికీ మనసు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో జీఓ తేవడం.. దాన్ని మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్రంలో మొదటి సారి ఇక్కడ అమలు చేయడం మా అదృష్టం. మంత్రి జగదీశ్రెడ్డి ఇచ్చిన పట్టాతో బ్యాంకులో లోన్ కూడా వస్తదంట. ఉంటదో పోతదోనని ఇన్ని రోజులు పాత గుడిసెలోనే ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మాకు హక్కులు వచ్చాయి.. మంచి ఇల్లు కట్టుకుంటాం.
– కాంపాటి సైదమ్మ, సుందరయ్యనగర్, సూర్యాపేట