చివ్వెంల, జూన్ 23 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో గురుకులాలు నిర్మించి విద్యారంగంలో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండలం ఐలాపురం వద్ద సువిశాల స్థలంలో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.4.20కోట్లతో రూపుదిద్దుకున్న గురుకుల పాఠశాలకు అదనంగా మరో రూ.5కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో ఫలితాలు చూసి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా గురుకులాల్లో ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
త్వరలో ప్రారంభంకానున్న పాఠశాల భవనానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల డైనింగ్ హాల్, కిచెన్ మార్పు చేయాలని సూచించారు. హైవే నుంచి పాఠశాలకు వెళ్లే దారిని ఆధునికరించే పనులు వేగం చేయాలని ఆదేశించారు. త్వరలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాలు, రహదారి వెంట ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి అదనపు కార్యదర్శి డీఎస్వీ శర్మ, ఆర్సీఓ లక్ష్మయ్య, డీఈ సత్యానంద్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ధరావత్ బాబూనాయక్, బోడపట్ల శ్రీను, వినోద్ ఉన్నారు.