నీలగిరి, జూలై 18 : ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులు ఆత్మన్యూనతాభావానికి గురికావద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ప్రతి అపజయం విజయానికి పునాది కావాలనేది యువత గ్రహించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం అభినందనీ యమని, కానీ జీవితానికి ప్రభుత్వ ఉద్యోగమే పరమావధి కాకూడదని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నల్లగొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న 2,300 నిరుద్యోగ యువతీ, యువకులకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ను మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక వైద్య విద్య చదివేందుకు ఇబ్బంది పడుతున్న దళిత విద్యార్థిని ధరణికి మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అందజేసిన రూ.లక్ష నగదును అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన మంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతరం క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఉద్యోగ ప్రయత్నంతోపాటు ఉపాధి అవకాశాలను అన్వేషించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కూడా అదేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, నాయకులు సంధినేని జనార్దన్రావు, ఐసీడీఎస్ ఆర్వో మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు.