రామగిరి, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడంతోపాటు ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నల్లగొండ గడియారం సెంటర్లోని మదీనా మసీద్లో ముస్లింలకు గురువారం రాత్రి నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వపరంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలు చేస్తూ ప్రత్యేక విందులు ఇస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాల్లో ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి ఉందని, తెలంగాణలో మాత్రం ప్రశాంత వాతావరణంలో అందరినీ గౌరవించేలా చర్యలు తీసుకున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలన యావత్ దేశానికే మార్గదర్శకంగా మారిందంటే అందుకు కారణం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే అన్నారు. మన సంక్షేమ పథకాలు చూసి దేశ ప్రజలు ఎంతో ఆదరణ చూపిస్తున్నారని పేర్కొన్నారు. దేశంతోపాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.
ముస్లిం మతపెద్ద మౌలానా బషీరొద్దీన్ రంజాన్ విశిష్టత వివరించారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి స్వయంగా ముస్లింలకు స్వీట్లు, పండ్లు తినిపించి భోజనం వడ్డించారు. వేడుకల్లో కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, ఎంఐఎం నేత ఖలీం, ముస్లిం మత పెద్దలు మౌలానా బషీర్, ఖయ్యూంబేగ్, ఫరీదొద్దీన్, జామాల్ ఖాద్రి, నిరంజన్వలీ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు, నాయకులు, ముస్లిం మతపెద్దలు, అధికారులు పాల్గొన్నారు.