చివ్వెంల, జనవరి 19 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలో గల జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం ఆయన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో దేశానికి రోల్మేడల్ నిలిచిందన్నారు. భౌతికంగా చూపు కొల్పోయిన వారికి తిరిగి ప్రసాదించడానికి చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడే జనం ప్రస్తుతం సీఎం కేసీఆర్ వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులతో సర్యారు వైద్యమే కావాలనే రోజులు వచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోడు, మందులు అందించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ తెలంగాణా వస్తే ఏం వస్తది అనేటోళ్లకు కంటి వెలుగే చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు. దేశంలోనే ఇటువంటి పథకం ఎక్కడా లేదన్నారు. పేదల పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ వైద్యం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, డీఎంహెచ్ఓ కోటాచలం, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ వేములకొండ పద్మ, బాషా, గుర్రం సత్యనారాయణ రెడ్డి, ప్రకాశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.