అరవయ్యేండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో గురువారం పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, ఇది ఆగకూడదంటే మరోమారు బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
సిండికేట్ దందాలు, రౌడీ రాజకీయాలు, గొడవలు లేకుండా చేసిన గులాబీ జెండా నీడలో ప్రజలు ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తొమిదిన్నరేండ్లుగా మనం కూడబెట్టుకున్న సంపదను దోచుకునేందుకు వస్తున్నారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 23 : అరవయేండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా ఆగం చేసిన విపక్షాల ఆట కట్టించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి అందరి కండ్లముందు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. అటువంటి అభివృద్ధి, ప్రశాంత పాలన కొనసాగాలంటే మరోమారు కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. మొదటి నుంచి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాలను అడ్డుకుంటూనే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసిందేమీ లేదన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో భారీగా చేరారు.
పలుచోట్ల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నియోజక వర్గ వ్యాప్తంగా మండలాల వారీగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలకు మంత్రి హాజరై మాట్లాడారు. సిండికేట్ దందాలు, రౌడీ రాజకీయాలు, గొడవలు, కొట్లాలు రూపుమాపిన గులాబీ జెండా నీడలో ప్రజలందరూ ప్రశాంతతో సుభిక్షంగా ఉన్నట్లు తెలిపారు. 2014, 2018లో ప్రజలందరి ఆశీర్వాదంతో ఓటు వేసి గెలిపిస్తే ఎంతటి అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసన్నారు. ప్రజలు కారు గుర్తుకు వేసిన ఓటే సూర్యాపేటను జిల్లాగా మార్చిందని. మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందని.. రెండు ట్యాంక్బండ్లు సాధించిందని.. వైకుంఠ ధామాలు, మహా ప్రస్థానాలు వచ్చాయని, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదం వచ్చినట్లు వివరించారు.
వస్త్ర, వాణిజ్య, వ్యాపారాలు, మాల్ మల్టీప్లెక్స్లు రావడంతో ఆర్థికంగా బలపడుతుండడమే కాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడినట్లు చెప్పారు. పచ్చని సూర్యాపేటలో మళ్లీ చిచ్చులు పెట్టేందుకు వస్తున్న విపక్షాల నీచ రాజకీయాలకు ప్రజలంతా ఏకమై ఓటుతో తగిన బుద్ది చెప్పాలని సూచించారు. అభివృద్ధికి చిరునామాగా మారిన గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అంతా ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పాలన కొనసాగించుకుందామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన బైరు మహేశ్, రాజపురం నాగార్జున, ఫిరోజ్ ఖాన్, మీసాల సైదులు, నజీర్, చితలపాటి శ్రీను, కప్పల సుమన్, మక్తావత్ నాగమణి, రాపర్తి చందు, శ్రవణ్, శ్రీకాంత్, సాయి, వినయ్, సుమన్తో పాటు 180 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్గౌడ్, అనంతుల యాదగిరిగౌడ్, గండూరి రమేశ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులుగౌడ్, నాయకులు బైరు వెంకన్న, కక్కిరేణి నాగయ్యగౌడ్, పలస వెంకన్న, బైరు దుర్గయ్య, ఎల్గూరి రమాకిరణ్, రాపర్తి శ్రీను, భూతరాజు ఉపేందర్, రాపర్తి సైదులు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : ఆత్మకూర్.ఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల గోపాల్రెడ్డి, గునగుంటి మల్సూర్గౌడ్, ఏపూరు గ్రామం నుంచి కడారి చంద్రారెడ్డి, బీరవెల్లి సుధాకర్రెడ్డి, పన్నాల మల్లారెడ్డి, సత్యనారాయణ, కరునాకర్తో పాటు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకుడు మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ మిర్యాల వెంకట్రెడ్డి, బోళ్ల వెంకట్రెడ్డి, తంగెళ్ల మధుసూదన్రెడ్డి, బ్రహ్మం, సత్యనారాయణరెడ్డి, గునగంటి భిక్షం, సైదిరెడ్డి, మిర్యాల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
చివ్వెంల : సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయం గ్రామంలో ప్రతిష్ఠించే బొడ్రాయి అని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని మోదిన్పురం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యాసంజీవ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, సర్పంచ్ నంద్యాల జనార్దన్రెడ్డి, జిల్లా నాయకులు రౌతు నర్సింహారావు, గుర్రం సత్యనారాయణరెడ్డి, ఊట్కూరి సైదులు పాల్గొన్నారు.