‘విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశాను. బతుకు దెరువు కోసం లాయర్ వృత్తి చేపట్టాను. పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ ఉద్యమం వైపు నడిచాను. 14 ఏండ్లపాటు కేసీఆర్ వెంట ఉండడంతో ఎన్నో జీవిత, రాజకీయ విషయాలు నేర్చుకున్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. ప్రాణం పోయేంత వరకు ప్రజల కోసమే సేవ చేస్తా’ అని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి పలు విషయాలు వెల్లడించారు.
ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామని, ఈసారి అన్ని వర్గాలు మెచ్చేలా మ్యానిఫెస్టోను రూపొందించామని తెలిపారు. వేల కోట్ల నిధులతో సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, పట్టణాన్ని నగరాలకు దీటుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని చెప్పారు. తనకు పోటీ ఎవరూ లేరని, మూడోసారీ గెలుస్తానని తెలిపారు. ఉమ్మడి నల్లగొండలో 12కు 12 సీట్లు బీఆర్ఎస్వేనని స్పష్టం చేశారు.
సూర్యాపేట, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అదే పంథాలో అభివృద్ధిని సైతం ఉద్యమంలా చేపడుతున్నట్లు చెప్పారు. వాస్తవానికి చదువుకునేటప్పుడు తాను వేరే మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నప్పటికీ బతుకుదెరువు కోసం లాయర్ వృత్తి చేపట్టినట్లు వెల్లడించారు. పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ ఉద్యమం వైపు మళ్లినట్లు చెప్పారు.
14 ఏండ్ల పాటు ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండడంతో జీవితం అంటే ఏంటో ? సమాజానికి తనవంతు ఏం చేయాలనేది నేర్చుకుని ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ వస్తున్నట్లు.. ప్రాణాలు పోయేంత వరకు ప్రజల కోసమే పని చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు వివరించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా సూర్యాపేటకు కావాల్సినవి, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతిదీ సాధించి తీరినట్లు తెలిపారు.
ఇప్పటికే కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు డిసైడ్ అయ్యారని సూర్యాపేటలో హాట్రిక్ విజయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాలు బీఆర్ఎస్ గెలువబోతోందని స్పష్టం చేశారు. పలు అంశాలపై మంత్రి నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ అభిప్రాయాలు పంచుకున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి : 2014 ఎన్నికల్లో సూర్యాపేటకు వెనువెంటనే స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చెప్పి ఉదయ సముద్రం నుంచి మూసీకి కృష్ణా జలాలను తెచ్చి సూర్యాపేటకు సరఫరా చేయించాను. పట్టణంలో పేరుకు రెండు, మూడు పార్కులు ఉన్నా ఆనవాళ్లు లేనందున వాటితో పాటు పార్కులు ఏర్పాటు చేస్తానని చెప్పి నేడు దాదాపు 50కి పైనే పార్కులు ఏర్పాటు చేశాను. అన్నింటికన్నా ప్రధానమైనది శాంతి భద్రతలు, అక్రమ వసూళ్లు చేసే వారి ఆటకట్టిస్తానని హామీ ఇవ్వగా తొమ్మిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క బెదిరింపులు లేకుండా సూర్యాపేట ప్రశాంతంగా ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ ట్యాంక్బండ్లను కూడా ఆనాడే హామీ ఇవ్వగా నేడు అవి ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఇలా అనేకం చేశా ను. అందుకే ప్రజలు మళ్లీ 2017లో గెలిపించారు.
మంత్రి జగదీశ్రెడ్డి : అసలు ప్రతిపక్షాలను ఎదుర్కొవడం ఏంటి ? వారు గతంలో సాధించింది శూన్యం. ఇప్పుడు చేస్తామనేది అబద్దం. అందుకే ప్రజలు వారిని అస్సలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014కు ముందు దేశంలో, రాష్ట్రంలో 50 ఏండ్ల పాటు పాలించింది వారే. అయినా ప్రజల కష్టాలను కనీసం పట్టించుకోలేదు. కానీ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం ఏంటో రుచి చూపించి కరువు కాటకాలను దూరం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నాం. చేసిన పనులతో పాటు చేయబోయే పనులనే ప్రత్యేకంగా ప్రజలకు చెబుతున్నాము. అందుకే ప్రతిపక్షాలను వరుసగా రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టిండ్రు. చెప్పిన దానికంటే ఎక్కువే అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీనే ఈసారి కూడా గెలిపించి హాట్రిక్ విజయం కట్టబెట్టి ప్రతిపక్షాలకు ప్రజలు చుక్కలు చూపడం ఖాయం.
మంత్రి జగదీశ్రెడ్డి : సూర్యాపేటలో ఎటు వెళ్లినా మెడికల్ కళాశాల, ట్యాంక్బండ్, మహా ప్రస్థానం, కలెక్టరేట్, డీపీఓ లాంటి ప్రభుత్వ భవనాలు, పార్కులు, విశాలమైన జంక్షన్లు మొత్తం మీద అనేక భవనాలు పట్టణానికి నలుదిక్కులా ఉండి ఐకాన్లను తలపించే రీతిన ప్రజల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అనేకం అమలు చేశాం. ఈసారి మ్యానిఫెస్టోను ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే తమ గెలుపునకు ధీమా.
మంత్రి జగదీశ్రెడ్డి : కాంగ్రెస్ అంటేనే అబద్దాల్లో నంబర్ వన్ అని ప్రజలకు తెలుసు. వాస్తవానికి తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన దాంట్లో యాభై శాతాన్ని గత ఐదు దశాబ్దాల్లో చేసి ఉంటే ఆ పార్టీకి అంతోఇంతో ప్రజాదరణ ఉండేది. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గంగిరెద్దుల మేళంలా వచ్చి నమ్మలేని హామీలు గుప్పించడం, తర్వాత గాలికి వదిలేయడంతో నేడు ఆ పార్టీ దీనస్థితికి చేరుకున్నది. ఇక ఆరు గ్యారంటీలంటారా.. అసలు కాంగ్రెస్కే వారంటీ లేదు.
ఇక ఆరు గ్యారంటీలు ఏంటీ? నేడు కర్ణాటకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో విద్యుత్, నీళ్లు, ఎరువులతో పాటు అనేక సమస్యలపై జరుగుతున్న పోరాటాలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. అంతే కాదు. తెలంగాణలో 24 గంటల కరెంట్ను 3 గంటలు చేస్తామని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్, ప్రజలు కట్టే ట్యాక్స్లతో రైతు బంధు ఎందుకని ఉత్తమ్కుమార్రెడ్డి, ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని భట్టి విక్రమార్క లాంటి వారు అంటుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అలాంటి కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించడం లేదు.
మంత్రి జగదీశ్రెడ్డి : అభివృద్ధికి, అరాచక శక్తులకు మధ్య జరుగుతున్న ఈ పోటీలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో మచ్చుకు కనిపిస్తుండగా బీజేపీ ఇతర పార్టీలు నామమాత్రంగా కూడా లేవు. డబ్బు, మద్యంతో పాటు భయానక వాతావరణం సృష్టిస్తూ గెలువాలని కొందరు, మతం, కులం పేరిట కుట్ర రాజకీయాలకు పాల్పడే వారి ఎత్తులు, జిత్తులు ప్రజల చేతిలో చిత్తుకాక తప్పదు. ప్రజాబలంతో నంబర్ వన్ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ను ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. బీఆర్ఎస్ గెలుపంటే వంద శాతం ప్రజలు గెలువడమే. సూర్యాపేటలో నాకు పోటీ లేదు.
మంత్రి జగదీశ్రెడ్డి : పార్టీ పరంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మ్యానిఫెస్టోకు అదనంగా సూర్యాపేటలో ప్రత్యేక మ్యానిఫెస్టో ఇచ్చి అమలు చేయాలనుకున్నాను. ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నోటి వెంట సదరు హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మందికి ఉపాధిని కల్పించేలా ఐటీ టవర్లు, డ్రై పోర్టు, పారిశ్రామిక వాడతో పాటు మూసీ, ఫణిగిరి, ఉండ్రుగొండ, పెద్దగట్టు, నాగులపాటి అన్నారం, పిల్లలమర్రి తదితర ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాను. ఇప్పటికే రెండు చెరువులు మినీ ట్యాంక్ బండ్లుగా మారగా మరో ప్రక్కన ఉన్న నల్ల చెరువును కూడా అభివృద్ధి చేసి నెక్లెస్ రోడ్డుగా మార్చుతా.