హాలియా, అక్టోబర్ 8 : స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారుల కోసం గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అవసరమైన చోట మినీ స్టేడియాలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో జాతీయ స్థాయి క్రీడాకారులున్న సాగర్ నియోజకవర్గానికి ప్రభుత్వం మినీ స్టేడియం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.3.75 కోట్లు కేటాయించగా.. హాలియా పట్టణంలో మినీ స్టేడియం నిర్మిస్తున్నారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2018లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందిన తరువాత హాలియాలో మినీ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కానీ.. కరోనా వైరస్, ఎమ్మెల్యే నర్సింహయ్య హఠాన్మరణంతో మినీ స్టేడియం నిర్మాణం ఆలస్యమైంది.
స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం హాలియాకు మినీ స్టేడియం మంజూరు చేయగా.. ఐదు ఎకరాల్లో సకల సదుపాయాలతో నిర్మాణం చేపడుతున్నారు. పనులను గత ఏడాది రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అయితే.. ఆ స్థలం తమదని కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు కోర్టుకు వెళ్లి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెలుపడంతో అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు కేసును కొట్టివేసింది. దీంతో స్టేడియం నిర్మాణ పనులు ముందుకు సాగాయి. స్టేడియంలో ట్రాక్ ఏర్పాటుతోపాటు కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, ఇండోర్ స్టేడియం, 450 మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ పార్క్, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. హాలియాలో మినీ స్టేడియం నిర్మిస్తుండడంతో క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం క్రీడాకారులకు నిలయంగా చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు కోకొల్లలు. అనుముల మండలంలోని నాయుడుపాలెం, ఇబ్రహీంపేట, అలీనగర్, మదారిగూడెం, తిరుమలగిరి సాగర్ మండలంలోని తిరుమలగిరి, పెద్దవూర మండలంలోని పెద్దగూడెం గ్రామాలకు చెందిన పలువురు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆడారు. దక్షిణ మధ్య రైల్వే టీమ్ కోచ్ సైతం ఈ ప్రాంతవాసి కావడం గమనార్హం. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామ వాసి ఏసియా జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఇబ్రహీంపేట, నాయుడుపాలెం, తిరుమలగిరి సాగర్ గ్రామాల్లో నిత్యం యవతీ యువకులు మ్యాట్పై గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటారు.
హాలియాలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషకరం. గత పాలకులు క్రీడల గురించి గానీ, క్రీడాకారుల గురించి గానీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ చొరవతో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టడం హర్షణీయం. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఎమ్మెల్యే భగత్కు క్రీడాకారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. పనులు త్వరగా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలి.
– అనుముల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, ఇబ్రహీంపేట