Mini AIIMS | గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న మినీ ఎయిమ్స్ కలగానే మిగిలిపోతున్నది. నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలరామారం మండలం మర్యాలలో ఆరెకరాల స్థలం కేటాయించి ఆరు నెలలైనా పనులు అడుగు ముందుకు పడడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం భూమిని ఎయిమ్స్కు అప్పగించారు. రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, ఎయిమ్స్ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు అసలు పనులే ప్రారంభం కాలేదు. మినీ ఎయిమ్స్ అందుబాటులోకి వస్తే జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లితోపాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర, శామీర్పేట మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడికి వచ్చే రోగులకు అత్యవసర చికిత్సలు అవసరమైతే బీబీనగర్ ఎయిమ్స్కు తరలించి ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది.
యాదాద్రి భువనగిరి, మే 8 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు (ఎయిమ్స్) తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక చోట మినీ ఎయిమ్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలోని బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ నిర్మించాలని ఎయిమ్స్ నిర్ణయించింది. దీని కోసం రూ.10 కోట్ల నిధులతో ప్రత్యేకంగా భవనం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం బొమ్మలరామారం పీహెచ్సీలో గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని ఓ గదిలో రూరల్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నది. ఇక్కడే శాశ్వతంగా ఎయిమ్స్ సేవలు కొనసాగించేందుకు అధికారులు ప్రతిపాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.
బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని ఎయిమ్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర సర్కారు గతేడాది నవంబర్ 15న ఆరు ఎకరాల భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పక్కన సర్వే నంబర్ 119లో ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రెవెన్యూ అధికారులు సైతం భూమిని ఎయిమ్స్ అధికారులు అప్పగించారు. అయితే కేంద్ర ప్రభుత్వ మూడు నెలల క్రితం అనుమతి ఇచ్చినా ఇప్పటికీ అడుగులు ముందుకు పడడంలేదు.
గతేడాది డిసెంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అప్పజెప్పింది. కానీ అధికారులు మాత్రం నత్తకు నడక నేర్పిన చందంగా నెమ్మదిగా స్పందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్లో ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. స్థలం ఇచ్చిన ఆరు నెలలవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మరోవైపు స్థలంలో ఏ నిర్మించాలో అనేది ఎయిమ్స్ అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. స్టాఫ్ కోసం క్వార్టర్లు కట్టుకుంటామని చెబుతున్నారు. ఇప్పుడున్న పీహెచ్సీ దగ్గరే స్థలం కావాలని పట్టుబడుతున్నారు. అయితే ఇక్కడ మినీ ఎయిమ్స్కు భూమి ఇస్తే.. భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్సీ సేవలను విస్తరిస్తే.. స్థలానికి ఇబ్బంది అవుతుందని స్థానిక పీహెచ్సీ డాక్టర్లు పేర్కొంటున్నారు.
బొమ్మల రామారంలో మినీ ఎయిమ్స్ నిర్మిస్తే వేల మందికి కార్పొరేట్ వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లితోపాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర, శామీర్పేట మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడికి వచ్చే రోగులకు అత్యవసర చికిత్సలు అవసరమైతే బీబీనగర్ ఎయిమ్స్ తరలించి ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది.