పెన్పహాడ్, ఆగస్టు 25 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2025కు 150 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఈమె ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ ఈ అవార్డులను సోమవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
మారం పవిత్ర 2023లోనూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె పురస్కరం అందుకోనున్నారు.