సూర్యాపేట టౌన్, నవంబర్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంపై కొండంత నమ్మకంతో బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న ప్రజలే తమ బలమని, అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేటను పదేండ్లలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని కోరారు. ఎన్నికల వేళ అభివృద్ధి నిరోధకులు వస్తున్నారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విజయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంపై కొండంత నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గత రెండు దఫాలుగా ఆశీర్విదిస్తూ అభివృద్ధికి పట్టం కట్టి, మరోమారు గెలిపించేందుకు అడుగడుగునా ఆదరిస్తున్న అన్ని రంగాల ప్రజలే తమ బలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రశాంతతో కూడిన నిరంతర అభివృద్ధికే మరోమారు పట్టం కట్టాలని కోరారు. అరవై ఏండ్లకు పైగా ఆగమైన తెలంగాణలో పదేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని.. మరోమారు అంతా ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. మంగళవారం సూర్యాపేటలో జరిగిన ఆయా సంఘాల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు.
విపక్షాల కుట్రలు చేదిస్తూ గత పదేండ్లుగా పెంచుకున్న సంపదను దోచుకునేందుకు అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ముసుగులో వస్తున్నారని.. అరాచక శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేరన్నారు. యావత్ దేశంలోనే మరెక్కడా లేని విధంగా బీఆర్ఎస్ పాలనలో సంచలనాత్మకంగా కొనసాగుతున్న ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, నిరంతర విద్యుత్, పుష్కలంగా సాగు, తాగు నీరు, రోడ్లు, ఆత్మగౌరవ భవనాలు, మెరుగైన విద్య, వైద్యం ఇలా అనేక రకాల అభివృద్ధి, సంక్షేమాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నట్లు చెప్పారు. గతంలో రౌడీ రాజకీయాలకు, సిండికేట్ దందాలతో, గొడవలు, కోట్లాటలతో భయానక వాతావరణంలో ఎంతో మంది ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇక్కడి ప్రజలెప్పటికీ మర్చిపోలేరన్నారు.
అలాగే అనేక కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన ఘటనలు కండ్లచూసినట్లు తెలిపారు. అటువంటి భయానక వాతావరణంలో బతికిన జనం 2014 నుంచి పెరిగిన ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జీవించడంతో పాటు వ్యాపారులు తమ వ్యాపారాలను ప్రశాంతంగా కొనసాగించుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా సూర్యాపేటలో అనేక వస్త్ర, వ్యాపార సంస్థలు, మాల్, మల్టీప్లెక్స్లు ఏర్పాటు అవుతుండడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అనేక రకాల మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఇంకా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ హబ్ను విస్తరించడంతో పాటు అనేక పరిశ్రమల ఏర్పాటుకు బడా వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారన్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రశాంత పాలనలో నిరంతర అభివృద్ధి, సంక్షేమాలను కొనసాగించుకునేందుకు అన్ని రంగాల ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీని మరోమారు ఆశీర్వదించి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు, ఆయా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.