రామగిరి, ఏప్రిల్ 10: ‘గురిగింజ తన నలుపు ఎరగదు’ అన్న చందంగా తయారైంది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు. పరీక్షల విభాగంలోని అధికారులు కొన్ని ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం పాస్ కావడంతో మిగిలిన
విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇటీవల విడుదలైన బీఈడీ మూడో సెమిస్టర్ ఫలితాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బీఈడీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్నల్ ప్రాజెక్టు పేపర్కు వేయాల్సిన మార్కులను యాజమన్యాలు తక్కువగా వేయడంతో మార్చి 25 విడుదలైన ఫలితాల్లో
ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. దీంతో విద్యార్థులు తమను ఇంటర్నట్ ప్రాజెక్టు పేపర్లో ఎలా ఫెయిల్ చేస్తారని ప్రశ్నించడంతో పరీక్షల విభాగం అధికారులకు వ్యక్తిగతం, వర్సిటీ పరీక్షల విభాగం మెయిల్కు లేఖలను పంపించి ఒత్తిడి తేవడంతో ఫలితాల్లో మార్పులు చేశారు. ఫెయిల్ అని వచ్చిన
విద్యార్థులకు ఇప్పుడు ఆన్లైన్లో పాస్ మెమోలు దర్శనమిస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల ఛాత్రోపాధ్యాయులకు ఫిబ్రవరి 2026న 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫలితాలను మార్చి 25న వర్సిటీ పరీక్షల విభాగం విడుదల చేసింది. ఆ సెమిస్టర్లో రెగ్యులర్ థియరీ పేపర్స్కు వర్సిటీ పరీక్షలు నిర్వహించి
ఫలితాలు ఇస్తుంది. అయితే ఇంటర్నల్ ప్రాజెక్టు సబ్జెక్టులకు సంబంధించి కళాశాలల్లో విద్యార్థులు సమర్పించిన రికార్డులు, అసెన్మెంట్స్ ఆధారంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మార్కులు వేయాల్సి ఉంటుంది.
వర్సిటీ బీఈడీ 3వ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించిన సమయంలో కొన్ని కళాశాలల్లోని
పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంటర్నల్ పేపర్ నెం EDN-22 (స్కూల్ బెస్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్ -కేస్ స్టడీ, ఎస్ఎంసీ అండ్ పీటీఏ)ఫెయిల్ అయ్యారు. తీరా ఆరా తీస్తే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు, అధ్యాపకులు ఆ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటాయో తెలియక అవగాహనారాహిత్యంతో ఇంటర్నల్ మార్కులను పాస్ మార్కుల కంటే తక్కువగా అప్లోడ్ చేశారు. దీంతో మర్రిగూడలో ఓ కళాశాల, చెర్వుగట్టు సమీపం, యాదాద్రిభువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లాలో బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలకు 2,713 మంది హాజరు కాగా 2,440మంది ఉత్తీర్ణత సాధించారు. 269మంది ప్రమోట్ అయ్యారు. ఆయా కళాశాలలు చేసిన తప్పులతో ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల్లో సుమారుగా 98మంది ఇంటర్నల్ ప్రాజెక్టు సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో విద్యార్థులు తమను ఇంటర్నల్ పరీక్షల్లో ఎలా ఫెయిల్ చేస్తారు అంటూ ప్రిన్సిపాళ్లను ప్రశ్నించడంతో ఆయా కళాశాల యాజమన్యాలు (ప్రైవేట్ బీఈడీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసిసియేషన్లోని బాద్యుల) సహాయంతో యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకవెళ్లినట్లు తెలుస్తుంది.
నిబంధనల ప్రకారం విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు తిరిగి వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ వర్సిటీ ఉన్నతాధికారులు అనుమతిస్తే మళ్లీ ఉత్తీర్ణత సాధించాలంటే సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ లేకుండానే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి
కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు ముడుపులు ఆశచూపి ఒత్తిడి తెచ్చాయనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మా వల్ల పొరపాటు జరిగింది(ఆయా కళాశాల యాజమాన్యాలు) మార్కులు సవరించి విద్యార్థులను పాస్ చేయండి అంటూ లేఖలు ఇవ్వడం, తమ పరపతిని ఉపయోగించడంతో
పరీక్షల విభాగం నిబంధనలు పక్కన పెట్టి ఫెయిల్ అయిన ఇంటర్నల్ ప్రాజెక్టు సబ్జెక్టుల్లో వర్సిటీ అధికారులు పాస్ చేశారు.
ఒకసారి ఫలితాలు విడుదలైన తర్వాత ఇలా వ్యక్తిగత లేఖల ఆధారంగా మార్పులు చేయడంతో ఫెయిల్ అని వచ్చిన విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్లో పాస్ అని మెమోలు దర్శనమిస్తుండటం
గమనార్హం. అధికారిక వెబ్ సైట్లో ఈ వింత మార్పులు చూసి మిగిలిన విద్యార్థులు అవాక్కవుతున్నారు. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న టెక్నికల్ కారణాలతో ఇబ్బంది పడే విద్యార్థులను పట్టించుకోని అధికారులు కళాశాలల యాజమన్యాల లేఖలతో నిబంధనలు మారుస్తున్నానే ఆరోపణలు వస్తున్నాయి. బీఈడీ 3వ
సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత తాను సెలవులో వెళ్లానని సీవోఈ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్నల్ ప్రాజెక్టు పేపర్లకు తిరిగి మార్కులు నమోదు చేసి పాస్చేయడంలో పొరపాటు జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు
తీసుకుంటామన్నారు.