మిర్యాలగూడ సెప్టెంబర్ 18 : మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టగా అక్కడిక క్కడే మృతి చెందాడు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (35) కుటుంబంతో కలిసి హైదరాబాదుకు వెళుతున్నాడు. నందిపాడు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడి ఉండటంతో కారు ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేశారు.
అంబులెన్స్ రాగా ఆ వ్యక్తిని అంబులెన్స్లో ఎక్కిస్తుండగా లారీ వేగంగా వచ్చి శ్రీనివాసరావును ఢీ కొట్టడంతో పాటు అంబులెన్స్ టెక్నీషియన్ స్వప్నను ఢీ కొట్టి అక్కడే ఉన్న మరో మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు మృతి చెందగా స్వప్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా లారీ డ్రైవర్ మద్యం సేవించడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.