ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. మెరుగైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. ఒకవైపు మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాలతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,786 (ప్రభుత్వ, లోకల్ బాడీ) పాఠశాలలకుగానూ రూ.4.30 కోట్లు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తొలి విడుతలో 50 శాతం నిధులు రాగా వీటిలో స్పోర్ట్స్కు సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి. మరో విడుతలో రూ.4.30 కోట్లు రానున్నాయి. గతంలో నిధుల కోసం ఏడాదంతా ఎదురుచూడాల్సి రాగా.. ఇప్పుడు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే శిథిల భవనాలు, తలుపు ల్లేని బాత్రూమ్లు.. కిటికీలు లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులు కూడా లేని పరిస్థితులు ఉండేవి. చిన్న చిన్న మరమ్మతులకు సైతం గ్రామ సర్పంచ్, దాతల సాయం కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పర్యాయాలు ఉపాధ్యాయులే ముందుకొచ్చి సొంత నిధులతో బడి పిల్లలకు మౌలిక వసతులు కల్పించారు. ఇందంతా ఒకప్పుడు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాలు చేపట్టి మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. తాజాగా పారిశుధ్య నిర్వహణ, వసతుల కల్పనకు సమగ్ర శిక్ష ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి నిధులు విడుదల చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ, లోకల్బాడీ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 50శాతం నిధులు మంజూరు చేసింది. ఎస్ఎంసీ తీర్మానంతో ఆ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల ఖర్చు, నిర్వహణపై ఆడిట్ కూడా ఉంటుంది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడ్జెట్
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1నుంచి 15 మంది విద్యార్థులుంటే 12,500రూపాయలు ఇస్తారు. 16నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25వేలు, 101నుంచి 250వరకు ఉంటే రూ.50వేలు, 251 నుంచి వెయ్యి మంది విద్యార్థులుంటే రూ.75వేలు, వెయ్యి కంటే ఎక్కువ ఉంటే లక్ష రూపాయల చొప్పున విడుదల చేశారు. ఉన్నత పాఠశాలలకు 1నుంచి 15మంది విద్యార్థులుంటే రూ.25వేలు, 16నుంచి 100మంది విద్యార్థులుంటే రూ.25వేలు, 101నుంచి 250 వరకు ఉంటే రూ.50వేలు, 251నుంచి వెయ్యి మంది ఉంటే రూ.75వేలు, వెయ్యి మంది కంటే ఎక్కువ ఉంటే లక్ష రూపాయల చొప్పున విడుదల చేసినట్లు సమాచారం.
నిధుల ఖర్చు – వినియోగం ఇలా..
ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అధ్యక్షుడి పేరున ఉన్న సంయుక్త బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి. ఎస్ఎంసీ తీర్మానంతో వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో పాఠశాలకు అవసరమైన రిజిస్టర్లు, కాగితాలు, చాక్పీసులు, డస్టర్లు, ఇతర స్టేషనరీ, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, విద్యుత్ బిల్లు చెల్లింపు, కంప్యూటర్, ప్రొజెక్టర్లు, టీవీ, టేబుల్, ఇంటర్నెట్ బిల్లు, డిజిటల్ తరగతుల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాలకు సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులకు, క్రీడా సామగ్రి కోసం ఉపయోగించాలి.
నిధులను సక్రమంగా వినియోగించాలి
పాఠశాలలకు ప్రభుత్వం విద్యాశాఖ – సమగ్రశిక్ష ఆధ్వర్యంలో విడుదల చేసిన నిర్వహణ, స్పోర్ట్స్ నిధులను సక్రమంగా వినియోగించాలి. సర్కార్ బడులను సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు – మన బడితో మౌలిక వసతులు కల్పించింది. బడులను సర్వాంగ సుందరంగా కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. ప్రధానోపాధ్యాయులపై భారం పడకుండా ముందుగానే నిధులు విడుదల చేసింది. ఎస్ఎంసీ తీర్మానంతో వాటిని వినియోగించాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు సాగాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ