రామగిరి, మార్చి 26 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు పీహెచ్డీ (డాక్టరేట్) పట్టా అందుకున్నారు. తాజాగా మరో ఏడుగురు పరిశోధన విద్యార్థులు వివిధ విభాగాల్లో పరిశోధనలు చేసి వర్సిటీ పరీక్షల విభాగానికి సమర్పించారు.
ఇప్పటికే పలు కోర్సులు
2007లో ఏర్పాటైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ వివిధ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. స్వరాష్ట్రంలో అధిక నిధులు కేటాయిస్తుండటంతో పీహెచ్డీ నోటిఫికేషన్స్ జారీచేసి వివిధ సబ్జెక్టులో పరిశోధనలకు వేదికగా మారింది. దాంతో నెట్, సెట్, జెఆర్ఫ్ అర్హత కల్గిఉన్న అభ్యర్థులు ఎంజీయూలో పీహెచ్డీలో చేరుతున్నారు. నిర్ణత సమయంలోనే గైడ్స్ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలను ఆయా విభాగాలకు సమర్పించడంతో వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి ఆమోదం తెలుపుతూ పీహెచ్డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రకటిస్తున్నది. వివిధ డిపార్ట్మెంట్స్లో ఇంకా 138 మంది పరిశోధన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఎంజీయూ విద్యార్థికి కేరళ వర్సిటీలో ఉద్యోగం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి గ్రామనికి చెందిన నిన్నెకంటి జాన్పాల్. 2009లో ఎంజీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. ఉద్యోగం చేస్తూనే 2017లో ఎంజీయూలో పీహెచ్డీలో చేరాడు. బిజినెస్మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్వాల రవి పర్యవేక్షణలో పరిశోధన చేసి 2022లో పీహెచ్డీ పొందాడు. డాక్టరేట్ సాధించిన జాన్పాల్ కేరళలోని సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు.
ఇప్పటికే పలువురికి డాక్టరేట్
ఎంజీయూలో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు పీహెచ్డీ పొందారు. కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల రవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీదేవి నుంచి ఇద్దరు, ఎకనామిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, గణితంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మద్దిలేటి, కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్యోతి, మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సబినాహెరాల్డ్ నుంచి ఆరుగురు విద్యార్థులు పరిశోధన పత్రాలు వర్సిటీకి సమర్పించారు. వీరందరికీ నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. త్వరలో వారికి కూడా పీహెచ్డీ అందనున్నది.
ఆధునిక అంశాల్లో పరిశోధనలకు అవకాశం
నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కొత్త మార్పులు తీసుకొచ్చేలా పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీలకు దీటుగా ఎంజీయూ 8 డిపార్టుమెంట్స్లో పీహెచ్డీ నోటిఫికేషన్స్ జారీచేసి నెట్, సెట్ అర్హత సాధించిన వారికి అడ్మిషన్లు అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఆరుగురు పీహెచ్డీ పొందగా మరి కొంత మంది తమ పరిశోధన గ్రంథాలను సమర్పించారు. త్వరలోనే పీహెచ్డీ అడ్మిషన్స్ కోసం పాలకమండలి నిర్ణయంతో మరో నోఫికేటిఫికేషన్ జారీ చేస్తాం. – సీహెచ్. గోపాల్రెడ్డి, వీసీ, ఎంజీయూ
నాణ్యతతో కూడిన పరిశోధనలు
నేను 2019లో ఎంజీయూ పీహెచ్డీలో చేరాను. కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల రవి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశాను. నా గ్రంథాన్ని వర్సిటీకి అందిస్తాను. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు దీటుగా ఎంజీయూలో పరిశోధనలు సాగుతున్నాయి. గుణాత్మ విద్యతోపాటు నాణ్యతతో కూడిన అంశాలతో పరిశోధనలు చేసేందుకు అన్ని అవకాశాలు కల్పించారు. ఎంజీయూలో పీహెచ్డీ చేయడం చాల సంతోషంగా ఉంది.
– పొన్న శ్రీలత, కామర్స్ పరిశోధన విద్యార్ధి, ఎంజీయూ