రామగిరి, ఫిబ్రవరి 9 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అధికారి వై.ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేసిన 130 మంది విద్యార్థులు హాజరయ్యారు.
వారికి హెటిరో డ్రగ్స్, కామినేని మెడికల్ సైన్సెస్ వారు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి 50 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ అధికారి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు అవకాశం కల్పించిన వర్సిటీ వీసీ గోపాల్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల హెచ్ఆర్లు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.