నీలగిరి, మే 23 : జిల్లాలో వైద్యాధికారుల తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి అగ్రహాం వ్యక్తం చేశారు. వైద్యుల పనితీరు సక్రమంగా లేదని, వారిలో మార్పు రాకపోతే ఏమాత్రం సహించేది లేదన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్కు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గత డిసెంబర్లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత రాజేశ్వరి మృతి విషయంలో మిర్యాలగూడలోని శీరిషా ఆస్పత్రిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మాతృ మరణాలపై వైద్యారోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత డిసెంబర్లో దామరచర్ల మండలం జైత్రం తండాకు చెందిన ఆడావత్ రాజేశ్వరి కాన్పు కోసం మిర్యాలగూడలోని శీరిషా ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ శీరిష చివరి నిమిషం వరకు ఆస్పత్రిలో ఉంచుకుని అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి పంపినట్లుగా తెలిపారు. రాజేశ్వరి ప్రసవానంతరం మృతి చెందిందన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన మిర్యాలగూడ శిరీషా ఆస్పత్రిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
రోగుల అవగాహన లోపం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల మాతృ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త మొదలుకుని ఆశ, ఏఎన్ఎం, పీహెచ్సీ డాక్టర్లు, సిబ్బంది గ్రామాల్లో గర్భిణీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం సమయంలో చేయించుకునే పరీక్షలు తదితర అంశాల పట్ల వారికి అవగాహన కల్పించాలన్నారు. గర్భం దాల్చిన నుండి ప్రసవం వరకు నిరంతరం ఏఎన్సీ చెకస్ తోపాటు ఈడీడీ ప్రకారం సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మధ్యలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినట్లయితే తక్షణమే చికిత్స అందించాలన్నారు. పీహెచ్సీలో సాధ్యం కాకపోతే ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేయాలని, అంతేగాని ప్రభుత్వ వైద్యులు సైతం అక్కడక్కడ ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు తదితర కారణాల వల్ల ప్రసవం తర్వాత మహిళలు మరణిస్తున్నారని, మరికొన్ని కేసుల్లో చికిత్సలు తీసుకోకపోవడం, పౌష్టికాహాకారం లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. ఆశలు, ఆంగన్వాడీలు, ఏఎన్ఎంలు ప్రతి గర్భిణీ ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, సీడీపీఓలు, వైద్యాధికారులు, ఎంపీహెచ్ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Nalgonda : బాలింత మృతిలో శీరిషా ఆస్పత్రిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశం