నీలగిరి, ఫిబ్రవరి 24 : నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన వనరు అని అదనపు ఎస్పీ జి.రమేశ్ అన్నారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సుమారు 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం (CEIR పోర్టల్ అలాగే IMEI ట్రాకింగ్) సహాయంతో పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. వన్ టౌన్ సిబ్బంది కె.సత్యనారాయణ, ఐటి కోర్ టీం సమన్వయంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను మంగళవారం అదనపు ఎస్పీ జి.రమేశ్ బాధితులకు స్వయంగా అందజేశారు. తమ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. “మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కంగారు పడకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల ఫోన్ దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయడంతో పాటు, దానిని త్వరగా కనిపెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తుల నుండి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు బిల్లులు, బాక్సులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఫోన్లలో వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ వివరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె.శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు గోపాల్ రావు, వెంకట నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత