యాదాద్రి, జూలై 25 : యాదాద్రి స్వయంభు దివ్యక్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహుడికి అర్చకులు విశేష పూజలు ఆగమశాస్త్రరీతిలో జరిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు చేశారు. ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాలు, ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. విశేష పూజా కైంకర్యాలను దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టారు. తెల్లవారు జాము మూడున్నర గంటల నుంచి స్వామివారికి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభూ మూర్తులకు అభిషేకించారు. అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటల నుంచి అరగంట పాటు స్వామివారికి తిరువారాధన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు వైభవంగా సాగాయి. దీక్షాపరుల మండపంలో సాగిన వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత మాచరించారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్యారాధనలో పాల్గొన్నారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ. 16,57,192 ఆదాయం సమకూరినట్లు ఈఓ ఎన్. గీత పేర్కొన్నారు.
యాదాద్రికి చేరిన సేవ పీట
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవకు వినియోగించే కొత్త సేవ పీటను దాతల సాయంతో ఆదివారం ఆలయానికి తీసుకొచ్చారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా శంకు చక్ర తిరునామాలతో తీర్చిదిద్దారు. ఈ పీటను ఉదయం వేళల్లో స్వామివారి సేవకు, అమ్మవారి ఊంజల్ సేవకు వినియోగించనున్నారు.
ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యాదాద్రిలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం యాదాద్రి కొండకు చేరుకున్న ఆమె స్వయంభు నారసింహుడిని దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ గోత్రనామాల పేర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చక బృందం మంత్రి కేటీఆర్ పేరున సంకల్పం జరిపి, స్వామివారి ఆశీర్వచనం జరిపారు. అనంతరం గొంగిడి సునీతకు అర్చకులు వేద ఆశీర్వచనం జరిపించారు. ఆమె వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ ఉన్నారు.