నల్లగొండ ప్రతినిధి, మార్చి26(నమస్తే తెలంగాణ) : నల్లగొండ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన అభ్యర్థిత్వానికి సహకరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరుడు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి కృష్ణారెడ్డి హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి వారి నివాసాల్లో కలిశారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్ను కంచర్ల సోదరులు కలిశారు.
తమను కలిసిన బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు సన్మానిస్తూ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తన గెలుపు కోసం అందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కంచర్ల సోదరులు కోరారు. అందరం సమన్వయంతో ఎన్నికల్లో పనిచేసి అధినేత కేసీఆర్కు విజయాన్ని కానుకగా అందిద్దామని మాజీ ఎమ్మెల్యేలంతా పేర్కొన్నారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.