నకిరేకల్, మే 2 : మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం నియోజకవర్గ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండో విడుత ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడుతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణలో తమకు సరైన వసతులు కల్పించడం లేదంటూ పీఓలు, ఏపీఓలు ఆందోళనకు దిగారు. కనీసం భోజన వసతి కల్పించకుండా చాయ్, బిస్కెట్తో సరిపెట్టారంటూ మండిపడ్డారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో కనీస భోజన వసతులు కల్పించకపోతే వడదెబ్బకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గానికో తీరుగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి, మలక్పేటలో రూ.2500, రూ.2400 ఇచ్చారని, దేవరకొండలో మరో విధంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నకిరేకల్లో రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఇచ్చే చార్ట్ ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 12న కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఎలక్షన్ మెటీరియల్, ఈవీఎంలు ముట్టుకోకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు భువనగిరిలో లంచ్ ఏర్పాటు చేశారని, రంగారెడ్డిలో రెండు పూటల శిక్షణ ఉందని, నకిరేకల్లో ఒక్కో పూట శిక్షణ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
శిక్షణకు వచ్చి వడదెబ్బకు గురై వికారాబాద్లో ఒకరు చనిపోయారని తెలిపారు. నకిరేకల్లో లంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదని తెలిపారు. రెమ్యూనరేషన్లో తేడాలను సవరించి తెలంగాణ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇతర జిల్లాల మాదిరిగా రెమ్యూనరేషన్ ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తామని, లేదంటే మూకుమ్మడిగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎలక్షన్ నోడల్ అధికారి నాగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ఎలక్షన్ ట్రైనింగ్ నోడల్ అధికారి ఎం.నాగయ్యను వివరణ కోరగా వసతులు, రెమ్యూనరేషన్ అనేవి జిల్లా ఎలక్షన్ అథారిటీ, కలెక్టర్ నిర్ణయమేనన్నారు. రెమ్యూనరేషన్ గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.