శాలిగౌరారం, మార్చి 10 : కండ్ల ముందే కొమ్మలు మాడిపోతుంటే తట్టుకోలేని ఓ నిమ్మ తోట రైతు తోటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పు చేసైనా సరే కాపాడుకునేందుకు ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పడుతున్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామ పంచాయతీ పరిధి జోలంగూడేనికి చెందిన రైతు జోలం లింగయ్యకు మూడు ఎకరాల నిమ్మతోట ఉన్నది. గతంలో తోటను కాపాడుకునేందుకు 10 బోర్లు వేశాడు. పదిలో నాలుగు మాత్రమే పోస్తుండగా అవి కూడా భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ప్రస్తుతం ఆగి ఆగి పోస్తున్నాయి.
ఈ నీటితో తోటను బతికించుకోలేననుకున్న లింగయ్య అదనంగా రూ.30వేలు ఖర్చు చేసి తోటలోనే జేసీబీ సహాయంతో 12 అడుగుల లోతు గుంటను తీశాడు. దీనికి తోడు నీళ్లు ఇంకిపోకుండా టార్ఫాలిన్ను గుంతలో పరిచి ఆగి ఆగి పోస్తున్న మోటర్లతో నీటిని డంప్ చేస్తున్నాడు. రెండ్రోజులు ఆపి మూడు ఎకరాల్లో ఉన్న 270 చెట్లకు నీళ్లు అందిస్తున్నాడు. 5రోజులకు ఒక్క తడి చొప్పున నీటిని పడుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో నీళ్లందియ్యడం కష్టతరం కానున్నట్లు రైతు లింగయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.