పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ వస్ర్తాల డిజైన్లు అద్భుతమని, ఇక్కడి కళాకారుల నైపుణ్యంతోనే చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, చేనేత మిత్ర, నేతన్న బీమా తదితర పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
త్వరలో ఫ్రేమ్ మగ్గాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పోచంపల్లిలో ఇంటినే రీసెర్చ్ సెంటర్గా మార్చుకొని చేనేత ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత బోగ బాలయ్య ఇంటికి బుధవారం మంత్రి అనుకోని అతిథిలా వెళ్లారు. ఈ సందర్భంగా 10వేల రంగులతో డబుల్ ఇక్కత్ వస్త్రంపై బాలయ్య రూపొందించిన భారతదేశం పటాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. గంటకుపైగా ఆయన ఇంట్లో గడిపి ప్రశంసించారు. అనంతరం టై అండ్ డై ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్, రీసెర్చ్ డెవలప్ మెంట్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ కోసం షెడ్ను మంజూరు చేశారు. దాంతో బాలయ్య దంపతులు ఆనందంతో ఉప్పొంగారు.