యాదగిరిగుట్ట, మార్చి 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లను అర్చకులు, వేద పండితులు సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 35,76,475 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు తనికెళ్ల భరణి
స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం గుట్టకు చేరుకున్న ఆయన స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ గొప్పగా యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారని కితాబునిచ్చారు. ఆలయ నిర్మాణాలు చూస్తుంటే మళ్లీ మళ్లీ స్వామి దర్శనానికి రావాలన్న ఆలోచన కలుగుతుందన్నారు.