మరుగునపడుతున్న శిల్పకళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి జీవం పోస్తున్నారు. రాష్ట్రంలో శిల్పకళాకారుల సంఖ్యను పెంచాలన్న సంకల్పంతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ(వైటీడీఏ)ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ సంప్రదాయ, శిల్ప కళాశాలను ఏర్పాటు చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఈఓ ఎన్.గీత ఆదివారం ప్రత్యేక పూజలు చేసి తరగతులను ప్రారంభించనున్నారు. లక్ష్మీనరసింహ సంప్రదాయ, ఆలయ శిల్పకళా కోర్సును యాదగిరిగుట్ట బస్టాండ్ ఎదురుగా ఉన్న శిల్పకళాశాల భవనంలో నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరంలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా కోర్సును నిర్వహించనున్నారు. వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిల్పకళా సంస్థ తిరుమల తిరుపతి, మహాబలిపురం వంటి సంస్థలతో సమానంగా కొనసాగనున్నది. అందుకోసం అనుభవజ్ఞులైన స్తపతుల సహకారంతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. ముగ్గురు అనుభవజ్ఞులైన స్తపతులతో ఆలయ సంప్రదాయ, శిల్ప, వాస్తు కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా వైటీడీఏ ఉప స్తపతి మోతీలాల్, గెస్ట్ లెక్చరర్లుగా హేమాద్రి, మొగిలి ఉండనున్నారు. అనుభవజ్ఞులైన వైటీడీఏ ప్రధాన స్తపతి సుందరరాజన్ సైతం విద్యార్థులకు శిల్పకళలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కళాశాల నిర్వహణకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏడాదికి కోటి రూపాయలను కేటాయించింది.
యాదాద్రి, డిసెంబర్ 3 : రాష్ట్రంలో శిల్పకళాకారుల సంఖ్యను మరింతగా పెంచాలన్న సంకల్పంతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ(వైటీడీఏ)ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ సంప్రదాయ, ఆలయ శిల్ప కళాశాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ కళాశాలలో తరగతులను ప్రారంభించనున్నారు. లక్ష్మీనరసింహ సంప్రదాయ, ఆలయ శిల్పకళా కోర్సును యాదగిరిగుట్ట బస్టాండ్ ఎదురుగా ఉన్న శిల్పకళాశాల భవనంలో నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరంలో 15 మంది విద్యార్థులు ఈ కోర్సులో శిక్షణ తీసుకోనున్నారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ అనుబంధంగా ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ముగ్గురు అనువభజ్ఞులైన స్తపతులతో ఆలయ సంప్రదాయ, శిల్ప, వాస్తు కోర్సులో శిక్షణను ఇవ్వనున్నారు. కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా వైటీడీఏ ఉప స్తపతి మోతీలాల్ వ్యవహరిస్తారు.
సంప్రదాయ, శిల్ప, ఆలయ వాస్తు కోర్సులో మొత్తం నాలుగు పాఠ్యాంశాలు ఉన్నాయి. ప్రతిమ భాగం, ప్రసాద భాగం, ఆంగ్లం, సంస్కృతం పాఠ్యాంశాలను శిల్పాశాస్త్రంలో శిక్షణ తీసుకునే విద్యార్థులకు బోధిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి 2నుంచి 4.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. మూడేండ్లపాటు సాగే ఈ కోర్సులో మొదటి సంవత్సరంలో డ్రాయింగ్పై అవగాహన కల్పిస్తారు. ప్రతిమను ఎలా గీసుకోవాలి? ప్రతిమ శరీర నిర్మాణం ఎలా రావాలి? శిల్పం ముఖం, మెడ కొలతలు ఏ విధంగా రావాలి? తదితరాలపై అవగాహన కల్పిస్తారు. మిగతా రెండేండ్లపాటు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పీఓపీ, స్టోన్, మెటల్తో విద్యార్థులకు శిల్పకళపై మెళకువలు నేర్పించనున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు యాదాద్రి ఆలయం, రామప్ప, భద్రకాళి, తిరుపతి దేవాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన కల్పిస్తారు.
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కవిత దర్యానీ ప్రత్యేక ప్రోత్సాహంతో పాఠ్య పుస్తకాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ప్రొఫెసర్ ఎస్.కుమార్, వైటీడీఏ ప్రధాన స్తపతి డాక్టర్ సుందర్రాజన్, ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ శాంతి స్వరూపిణి, ప్రొఫెసర్, స్తపతి డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ మోతీలాల్ ఉన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలకు తాత్కాలిక ప్రిన్సిపాల్గా వైటీడీఏ డిప్యూటీ స్తపతి మోతీలాల్ కొనసాగనున్నారు. ఉపాధ్యాయులుగా వైటీడీఏ స్తపతులు హేమాద్రి, మొగిలి ఉన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేవాలయాల నిర్మాణ రంగంలో ఉద్యోగాలు, ఉపాధితోపాటు పై చదువుకు అవకాశం ఉంటుంది.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం పూర్తి కృష్ణశిలలతో సంప్రదాయ, శిల్ప, ఆలయ వాస్తుతో పునర్నిర్మాణం జరిగింది. దేశంలో అనుభవజ్ఞులైన ప్రధాన స్తపతులతో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. కృష్ణదేవరాయల అనంతరం శిల్పం, వాస్తు, పాంచరాత్రాగమ శాస్ర్తాలను వినియోగించి ఆలయాన్ని పునర్నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పొచ్చు. 2,500 మంది శిల్పులు ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్నారు. పూర్తి కృష్ణశిలలతో ఇంతటి అద్భుత క్షేత్రం నిర్మించిన దాఖలాలు మరెక్కడా లేవు. అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తతల రాజగోపురాలు, దశావతారమూర్తులు, 240 దేవతామూర్తులు, దశావతారాలు, వివిధ అవతారాల అమ్మవారి విగ్రహాలను అమర్చారు. ద్వితీయ ప్రాకారంలోని బయటి ప్రాకారంలో నిర్మించి అష్టభుజి మండపాలకు గల పిల్లర్లకు వివిధ రకాల దేవతామూర్తులు, దశావతరాలు, అమ్మవారు, విగ్రహాలతోపాటు తెలంగాణ సాంస్కృతి, వివిధ రకాల నాణేలు, తెలంగాణ పండుగను గుర్తిస్తూ చక్కటి ఆకరాలను చెక్కారు. ఈ కాలంలో వాడిన నాణేలు, కరెన్సీ మరో వెయ్యేండ్లు గుర్తిండిపోయేలా పిల్లర్లలో భద్రపరిచారు. అష్టభుజి మండపాల్లో నిర్మించిన 158 పిల్లర్లకు వివిధ రకాల చక్కటి ఆకృతులను తీర్చిదిద్దారు. యాళీ పిల్లర్ల సోయగం, ఆకాశాన్ని తాకేలా సప్తతల రాజగోపురం, అష్ట దిగ్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నీరుటి, వరుణుడు, వాయుదేవుడు, కుభేరుడు, ఈశాన్యుడి విగ్రహాలను అమర్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో స్తపతుల కృషిని ప్రత్యక్షంగా గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. రాబోయే తరానికి మరింత మంది స్తపతులను అందించాలన్న సంకల్పంలో వైటీడీఏ ఆధ్వర్యంలో 3 ఏండ్ల ట్రెడిషనల్ కల్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సును ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఈ కోర్సును యాదగిరిగుట్టలోనే ప్రారంభిస్తున్నాం. ఈ కళాశాలకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చేసిన సహకారం అభినందనీయం.
-జి.కిషన్రావు, వైస్ చైర్మన్, వైటీడీఏ
వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిల్పకళా సంస్థను తిరుమల తిరుపతి, మహాబలిపురం లాంటి సంస్థలతో సమానంగా కొనసాగనుంది. ఇందుకోసం అనుభవజ్ఞులైన స్తపతుల సహకారంతో పాఠ్యాంశాలను రూపొందించాం. అనుభవజ్ఞులైన స్తపతులతో విద్యార్థులకు ఆలయ సంప్రదాయ, శిల్ప, వాస్తు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నాం. యాదాద్రి ఆలయం, రామప్ప దేవాలయం, భద్రకాళి, భద్రాచలం, తిరుపతి దేవాలయాలను విద్యార్థులు సందర్శిస్తారు.
-డాక్టర్ మోతీలాల్, డిప్యూటీ స్తపతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్, శిల్పకళాశాల,
యాదగిరిగుట్ట