యాదగిరిగుట్ట, మార్చి18 : యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కొండపైన లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని సోమవారం కనుల పండువగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కమనీయ వివాహ వేడుకను భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. రాత్రి 8.45 గంటలకు స్వయంభూ ప్రధానాలయ ఉత్తర మాఢవీధుల్లో నెలకొల్పిన ప్రత్యేక కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ తంతు వైభవంగా సాగింది.
ముక్కోటి దేవతలు అహుతులుగా, చతుర్ముఖ బ్రహ్మాది దేవతల సమక్షంలో యాదగిరి నృసింహస్వామి లోక కల్యాణార్థం సముద్ర తనయ మహాలక్ష్మి అమ్మవారి మెడలో రాత్రి 11 గంటలకు తులాలగ్న సుముహూర్తంలో మాంగళ్యధారణ చేశారు. పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో నవ వరుడిగా అలంకృతుడైన లోక కల్యాణ కారకుడు నరసింహస్వామి గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా, భక్త జనకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో ఉత్తర మాఢవీధుల్లో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలోని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
దేవదేవుడు నరసింహ స్వామికి లక్ష్మి అమ్మవారి తండ్రి సముద్రుడు పాద ప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతును చేపట్టారు. వధూవరులు నరసింహ స్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం అలంకరించే కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం కల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు నిర్వహించారు.
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం లక్ష్మీనరసింస్వామిని శ్రీరామ అలంకరణలో తీర్చిదిద్ది హనుమంత వాహనంపై వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. పశ్చిమ రాజగోపురం నుంచి ఉత్తర, తూర్పు, దక్షిణ మాఢవీధుల్లో తిరుగుతూ భక్తులను దర్శనమిచ్చారు. జయజరామ.. జానకి రామ అంటూ భక్తులు దర్శించుకుని తన్మయత్వం పొందారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు నారసింహుడిని శ్రీరాముడి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.
నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహా య కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్బాబు, రఘు, గట్టు శ్రవణ్కుమార్, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ప్రధానాలయ తిరుమాఢ వీధులు కిక్కిరిసిపోయాయి. గోవిందా గోవిందా అంటూ భక్తులు స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
గుట్ట బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుఢ వాహనంపై కల్యాణమూర్తి లక్ష్మీనరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 8.45 గంటలకు దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ తిరు మాఢవీధుల్లో రథంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉదయం శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభార భేరి, శ్రీనివాస్ అండ్ పార్టీ, శ్రీశంకర మహిళా భజన మండలి, ఖమ్మానికి చెందిన శ్రీకృష్ణ బృందం వారిచే భజన, మైలవరపు శ్రీనివాస్రావు ఉపన్యాసం, ముదపాక బాల సుందరం భాగవతార్ వారి హరికథ నిర్వహించారు. సాయంత్రం నూకల జగదీశ్వరి, భక్తిరంజని, శ్రీగోదా నరసింహారావు వారి భక్తి సంగీతం, ఊర్జిత ఉమాకాంత్ రావు కర్ణాటక సంగీతం, జయప్రదా రామ్మూర్తి వారి వేణుగాన కచేరి భక్తులను కట్టిపడేశాయి.
స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సభ్యులతో.. ఆలయం తరఫున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఈఓ భాస్కర్రావు సమర్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల స్థానంలో వారు అధికారికంగా అందజేశారు. కల్యాణోత్సవంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతోపాటు జిల్లా కోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.