చౌటుప్పల్ రూరల్,మే 3 : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సీపీఎం నాయకులతో కలసి సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా మునుగోడు నియెజక వర్గంలో కల్లాల్లో పోసిన ధాన్యపు రాశులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు.
గత ప్రభుత్వం రైతులను కంటి రెప్పలా చూసుకుందని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి, మద్దతు ధర చెల్లించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక రకాల హమీలు ఇచ్చి అమలు చేయలేక ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు భరోసా పథకాలకు కాంగ్రెస్ సర్కార్ పంగనామాలు పెట్టిందన్నారు. గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే రాజగోల్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. క్వింటాల్కు 8 కిలోలు ధాన్యం కోత విధించి రైతుల కష్టాన్ని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.
పదవులపై ఉన్న ధ్యాస రైతు సమస్యలపై లేదని, ఉంటే రైతులను ఇబ్బందులకు గురి చేసేవాడు కాదని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి నెల రోజులవుతున్నా కోనేవాడు లేడని, ఇందుకు ఎమ్మెల్యే సిగ్గుపడాలని అన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం రైతు సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని, లేకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐదువేల మంది రైతులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యాడ శేఖర్, సర్పం చ్ గుండెబోయిన శిరీషా ఇస్తారి యాదవ్, శ్రీనివాస్గౌడ్. సీపీఎం నాయకులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.