మిర్యాలగూడ పట్టణంలో మినీ రవీంద్రభారతి అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో రూ.9.50 కోట్లతో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో అత్యద్భుతంగా నిర్మించారు. పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఎకరన్నర స్థలంలో సకల వసతులతో నిర్మించగా.. ఈ నెల 2న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా ప్రారంభించారు.
మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయి జానపద, సాంస్కృతిక, గద్య, పద్య నాటిక పోటీలు నిర్వహిస్తుంటారు. వీటికి సరైన వేదిక లేకపోవడంతో దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం రూ.9.50 కోట్లు మంజూరు చేసింది. పనులు పూర్తి కాగా.. ఇటీవల ప్రారంభమైంది. దీంతో కళాకారులకు మంచి సౌకర్యాలతో కూడిన వేదిక అందుబాటులోకి వచ్చింది.
కళాకారులకు సౌకర్యవంతమైన వేదిక
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మిర్యాలగూడ పట్టణంలో అన్ని వసతులతో మినీ రవీంద్రభారతి నిర్మించారు. ఈ వేదిక పట్టణ పరిసర ప్రాంతాల సాంస్కృతిక కళాకారులకు సౌకర్యవంతంగా ఉండనుంది. అధునాతన వసతులతో నిర్మించిన మినీ రవీంద్రభారతి కళాకారులకు, ప్రేక్షకులకు, సాహతీప్రియులకు అందుబాటులోకి రావడంతో సాంస్కృతిక కళారంగం మరింత అభివృద్ధి చెందుతుందని సాహితీప్రియులు పేర్కొంటున్నారు.
సకల సౌకర్యాలు..
మినీ రవీంద్రభారతి హాల్ను సినిమా థియేటర్ మాదిరిగా నిర్మించారు. 650 లగ్జరీ సీట్లతో ప్రేక్షకుల గ్యాలరీ, హాల్ మొత్తానికీ ఏసీ సౌకర్యం, సౌండ్ బాక్సులు, ఎల్ఈడీ లైట్లు, భారీ వేదిక ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు అరెకరం స్థలంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఇందులో పలు రకాల పూల మొక్కలు నాటారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పార్కింగ్, గ్రీనరీ చుట్టూ ఎల్ఈడీ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు.
కళాకారులకు మంచి వేదిక
మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన మినీ రవీంద్రభారతి అత్యద్భుతంగా ఉన్నది. ఈ వేదిక మిర్యాలగూడ పట్టణానికి గర్వకారణం. ఎమ్మెల్యే భాస్కర్రావు పట్టుదలతో మినీ రవీంద్రభారతి నిర్మాణం కావడం సంతోషకరం. ఇది కళాకారులకు కానుక. దీంతో సాంస్కృతిక కళారంగం మరింత అభివృద్ధి చెందుతుంది.
– పులి కృష్ణమూర్తి, మిర్యాలగూడ సాంస్కృతిక కళావేదిక అధ్యక్షుడు