పోరాడి సాధించుకున్న తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో భారతావనికి మార్గదర్శనం చేస్తున్నది. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాడల్ దేశానికి అవసరమనే భావన అంతటా వినిపిస్తున్నది. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, పేదల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష వెల్లువెత్తుతున్నది. మత విద్వేషపు మంటల్లోకి నెట్టివేయబడుతున్న జాతిని కాపాడేందుకు, ఢిల్లీ వేదికగా సాగుతున్న స్వార్థ , సంకుచిత రాజకీయాలను రూపుమాపేందుకు ముందుకు రావాలని యావత్ తెలంగాణ నినదిస్తున్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని జడ్పీటీసీ సభ్యులూ ముక్తకంఠంతో చెబుతున్నారు. కేసీఆర్ సారథ్యంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని, సభ్యులకు గౌరవ వేతనం పెంచి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేస్తున్నారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం కొట్లాడి సాధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేస్తున్నారు. ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమను చూసిన ఇతర రాష్ర్టాల ప్రజలు ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం ఉంది.
– నారబోయిన స్వరూపారాణి, జడ్పీటీసీ(మునుగోడు)
సీఎం కేసీఆర్తో దేశానికి మంచి భవిష్యత్
ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడు. కేంద్రంలోని బీజేపీ దుష్ట పాలనను అంతమొందించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. 24గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం జలాలతో చెరువులో నీళ్లు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయం పండుగలా మారి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలు, దళితుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి తప్పక రావాలి. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం, ధరల పెంపుతో ప్రజలు విసిగిపోయారు. అందుకే సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత అయితే ప్రపంచంలోనే భారత్ ముందు వరుసలో ఉండడం ఖాయం. దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.
– వీరప్రసాద్యాదవ్, జాజిరెడ్డిగూడెం జడ్పీటీసీ
దేశానికి రైతును రాజు చేస్తాడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండుగ అనుకొని వదిలేసుకున్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో నేడు రైతులు పండుగలా చేసుకుంటున్నారు. ఎడారి అవుతుందనుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గోదారమ్మను వెనక్కు తెప్పించి కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు నీరందిస్తూ సాగు విస్తీర్ణం పెంచి రైతుల కళ్లల్లో ఆనందం నింపారు. దేశమే ఆశ్చర్యపోయేలా ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సమయానికి ఎరువులు అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తూ రైతులను రాజుగా మార్చారు. ఆవాస గ్రామాలు, తండాలు ప్రత్యేక పంచాయతీలుగా మారి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కరెంట్ ఇవ్వకుండా వచ్చిరాని విధానాలు ప్రవేశపెట్టి ఆగమాగం చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణలో రైతులకు అందుతున్న లబ్ధి, సౌకర్యాలు మాకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ వంటి నాయకుడు మాకు వస్తే మా బతుకులు బాగుపడుతాయని ఆశిస్తున్నారు. దేశానికి రైతును రాజు చేయగల దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే.
– జీడి భిక్షం, సూర్యాపేట జడ్పీటీసీ (బొడ్రాయిబజార్)
కేసీఆర్ అపార అనుభవం దేశానికి అవసరం
దేశ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలంటే సరైన నాయకత్వం ఉండాలి. రాజకీయంగా అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ దేశానికి అవసరం. కొత్త రాష్ట్రం తెలంగాణను ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సబ్బండ వర్గాలకు అండగా నిలిచారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా నిలుపగా.. జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు పనికిమాలిన ఆరోపణలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ.. తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నది. జన బలం లేని కాషాయ పార్టీ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం కులం, మతం పేరిట విద్వేశాలను రెచ్చగొడుతున్నది. యువతలో చెడు ఆలోచనలు రేకెత్తించి విష బీజాలు నాటిస్తున్నది. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో సాధించిన ప్రగతి ఏది? ప్రజలకు చేసిన మేలు ఏముంది.? మతతత్వ బీజేపీతో దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అపార రాజకీయ అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం. ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీర్చిద్దిదుతున్న సీఎం కేసీఆర్తో దేశ ప్రగతి కూడా పరుగులు పెట్టడం ఖాయం.
– గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, జడ్పీటీసీ (మోత్కూరు)
స్వర్ణ భారత్ కేసీఆర్తోనే సాధ్యం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే సువర్ణ భారత్ కావడం ఖాయం. కేవలం ఎనిమిదేండ్లల్లో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం రూపురేఖలు మారుతాయి. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగాన్ని ఉన్నతంగా నిలిపారు. ఇవన్నీ దేశంలోని రైతులందరికీ అందాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరింపజేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించే సత్తా కేసీఆర్కే ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడానికి కారణమైంది. ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అమ్ముతూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి నాయకుల అవసరం ఉన్నది. కేసీఆర్తోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాం.
– మారుపాక అరుణాసురేశ్గౌడ్, జడ్పీటీసీ (దేవరకొండ రూరల్)
దేశ శ్రేయస్సు కేసీఆర్తోనే సాధ్యం
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన పూర్తి అవగాహన సీఎం కేసీఆర్కు ఉంది. రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేకూరుతున్నది. ఈ పథకాలను కేసీఆర్ దేశవ్యాప్తంగా పేదలకు అందిస్తాడనే విశ్వాసం ప్రజల్లో పెరిగింది. దేశంలోని రైతులను ఆదుకునే ఆపద్బాంధవుడు కేసీఆర్ మాత్రమే. ఇంతటి అభిమానం ఉన్న నేతకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ అపూర్వ ఆదరణ లభిస్తుంది. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదురించగల నాయకుడు కేసీఆరే. యావత్ తెలంగాణ సమాజం కూడా సీఎం కేసీఆర్ వెనుకే నడుస్తుంది.
– అనూరాధ, జడ్పీటీసీ (యాదగిరిగుట్ట)
జాతీయ పార్టీ ఏర్పాటుతో గుణాత్మక మార్పు
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లోకి వస్తే గుణాత్మక మార్పు రావడం ఖాయం. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని రంగాలు వెనుకబడి ఉన్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే అభివృద్ధి చేసి చూపించిండు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టిండు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ సమస్యలను పరిష్కరించగలడు. దేశంలో అపారమైన వనరులున్నాయి. వాటిని వినియోగించి ప్రజలకు మేలు చేసే ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్తోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని సామాన్యుల కష్టాలు తీరుతాయి.
– తరాల బలరాములు, జడ్పీటీసీ (కట్టంగూర్)
ప్రజలకు ఏం కావాలో తెలిసిన నేత కేసీఆర్
ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం. దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది. పెరిగిన ధరలతో పేద ప్రజలు అల్లాడుతున్నరు. సీఎం కేసీఆర్తోనే ముక్త్ భారత్ సాధ్యం. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశానికి నాయకత్వం వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కేసీఆర్ సంకల్పం గొప్పది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పోరాటయోధుడు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన సీఎం ఆయన. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధించి దేశానికే తలమానికంగా నిలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు చేపట్టలేకపోతున్నాయి. అందుకే దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరు. కేంద్రంలోని బీజేపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు బతుకలేకపోతున్నరు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలో అల్లాడిపోతున్నరు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు రాజుగా బతుకుతున్నడు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్తో సంతోషంగా ఉన్నారు. పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి గ్రామాలకు తిరిగొస్తున్నారంటే పల్లెలు ఎంత అభివృద్ధి చెందాయో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై కేసీఆర్ దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టిన విషయం తెలిసిందే. ఆయన పోరాట పటిమ, ఆలోచన విధానాలు దేశానికి అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఒక గుంట భూమి ఉన్నా చాలు దర్జాగా బతుకొచ్చని పొరుగు రాష్ర్టాల రైతులు కూడా అంటున్నరు. ఇలాంటి పథకాలు మాకు కూడా కావాలని రైతులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నరు. సీఎం కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి అన్ని రాష్ర్టాల ప్రజల నుంచి మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
– పాశం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ (మర్రిగూడ)
భావితరాలు బాగుపడుతాయ్..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నది. బీజేపీ రాక్షస పాలన పోవాలంటే సీఎం కేసీఆర్ దేశం కోసం మరో ఉద్యమం చేపట్టాలి. దేశ ప్రజల కోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆయన వెంట మేమంతా నడుస్తాం. గుజరాత్ మాడల్ వద్దు.. తెలంగాణ మాడల్ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడంలో ఆయనకు తెలిసినంత దేశంలో ఏ నాయకుడికీ తెలియదు. కేసీఆర్కు దేశంలోని అన్ని ప్రాంతాల పట్ల అవగాహన ఉంది. అన్ని భాషలు వచ్చిన సీఎం కేసీఆర్ దేశానికి నాయత్వం వహించడం చాలా అవసరం. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తాననడంతో బీజేపీ బ్యాచ్కు భయం పట్టుకుంది. ఈడీ, సీబీఐ దాడులంటూ పిచ్చి పనులు చేస్తున్నారు. మోదీ పాలనలో దేశ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు.
– శ్రీరాముల జ్యోతీఅయోధ్య, జడ్పీటీసీ (అడ్డగూడూరు)
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే..
ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం అవసరం. ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తే దేశం అభివృద్ధి బాట పడుతుంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. అనేక అద్భుతాలు చేసి చూపించారు. సాగునీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడ్డ పరిస్థితుల నుంచి పుష్కలంగా నీళ్లు, 24 గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్ది. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై అన్ని రాష్ర్టాలు విశ్లేషణలు చేసుకుంటున్నాయి. తమ రాష్ర్టాల్లో వాటిని అమలు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా తెలంగాణ పథకాలన్నీ అమలు చేస్తారు. దాంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు.
– గాలి సరిత, జడ్పీటీసీ (గుర్రంపోడు)
కేసీఆర్ కేంద్రంలో కీలకపాత్ర పోషించాలి
ప్రస్తుత దేశ రాజకీయాల్లో మార్పులు తప్పనిసరి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి తప్పనిసరిగా రావాల్సిందే. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన చేస్తారని వివిధ రాష్ర్టాల ప్రజలు నమ్ముతున్నారు. మోదీని ధీకొట్టే సత్తా ఒక్క కేసీఆర్కే ఉంది. 60 ఏండ్ల చరిత్రలో దేశంలో ఏ పార్టీ, ఏప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే దేశం మొత్తం బాగుపడుతుంది.
-కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, చింతపల్లి జడ్పీటీసీ, మహిళా శిశుసంక్షేమ శాఖ నల్లగొండ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ (మాల్)
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే అవుతుంది..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అరాచకాల నుంచి దేశం విముక్తి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన విధంగానే భారతదేశాన్ని కూడా బీజేపీ పాలన నుంచి విముక్తి చెందే విధంగా కేసీఆర్తో ఇతర నాయకులు కలిసి రావాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలను మార్చే సమవర్థవంతమైన నాయకుడు కేసీఆర్. కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించగల సత్తా ఆయనకే ఉన్నది. మతతత్వ రాజకీయాలను తిప్పికొట్టి బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడే రోజు తొందరలోనే ఉన్నది. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. చాలా రాష్ర్టాల్లో ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు.
– రాపోలు నర్సయ్య, జడ్పీటీసీ