భువనగిరి అర్బన్, జాన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి సునీతా మహేందర్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పూలమాలలు వేశారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పలువురు ఉద్యమ కారులను సన్మానించారు. కార్యక్రమంలో గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెకచేయకుండా తెలంగాణ సాధనకు చేసిన కృషిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో ఉద్యమకారులు అమరులైనారని, అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేమన్నారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీకిరణ్ కుమార్, జనగాం పాండు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓంప్రకాష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.