మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మ్యానిఫెస్టో అంశాలు వెలువడిన వెంటనే ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు సైతం సంబురాలు జరుపుకొన్నారు. మ్యానిఫెస్టోను
స్వాగతిస్తూ పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటా ధీమా పేరుతో బీపీఎల్ కుటుంబాలకు రూ.5లక్షల బీమా, రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన మహిళలందరికీ రూ.3వేల భృతి పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. దాంతోపాటు ఆసరా పెన్షన్లను దశలవారీగా రూ.5,016కు, దివ్యాంగులకు రూ.6,016కు పెంచడం పట్ల లబ్ధిదారుల్లో సంతోషం
వ్యక్తమవుతున్నది. ఇక రైతుబంధు పథకం ద్వారా ఏడాదిలో ఎకరానికి గరిష్ఠ సాయం రూ.16,000లకు పెంచడం పట్ల రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మరోసారి రైతుబంధు పెంపుతో రైతు బాంధవుడిగా
కేసీఆర్ను కీర్తిస్తున్నారు. ఇక తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. పేదలకు ఇండ్ల స్థలాలు, అసైన్డ్ ల్యాండ్స్తో పాటు అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో వెల్లడించారు. వీటితోపాటు ఇప్పటికే కొనసాగుతున్న దళితబంధు, బీసీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మితోపాటు మిగతా అన్ని పథకాలను విజయవంతంగా కొనసాగించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తాజాగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరనున్నది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. నల్లగొండ జిల్లాలో 4.70లక్షల కుటుంబాలకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలోని అంశాల ద్వారా లబ్ధి చేకూరనుంది. మరింత ఆర్థిక భరోసా లభించనుంది. ‘కేసీఆర్ బీమా – ప్రతి ఇంటా ధీమా’ పథకంలోకి సుమారు 4.66లక్షల బీపీఎల్ కుటుంబాలు రానున్నాయి. అయితే.. ఇందులో రైతు బీమా తరహాలో 59 ఏండ్లలోపు కుటుంబ యజమాని చనిపోతే కారణాలతో సంబంధం లేకుండా ఎల్ఐసీ నుంచి రూ.5లక్షలను నేరుగా ఆ కుటుంబానికి అదనుంది. ఇప్పటికే రైతు బీమా ద్వారా జిల్లా రైతాంగానికి ఆపద సమయాల్లో భరోసా ఇస్తున్నది. ఇప్పటివరకు చాలా మంది బీమాపై అవగాహన లేక కుటుంబ పెద్దను కోల్పోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక తెల్ల రేషన్ కార్డుదారులందరికీ వచ్చే ఏప్రిల్, మే నెల నుంచి సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. తద్వారా జిల్లాలోని 991 రేషన్ దుకాణాల ద్వారా 4.66లక్షల కుటుంబాలకు ప్రతినెలా 8.96 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందనుంది.
అర్హులైన మహిళలందరికీ రూ.400కే వంటగ్యాస్ సిలిండర్ అందించే మరో బృహత్తర పథకం రూపొందించారు. నల్లగొండలో 4.97లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ప్రతి నెలా సుమారు లక్ష సిలిండర్లు రీఫిల్కు రానున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రకటనతో జిల్లాలో రానున్న కాలంలో ప్రతి నెలా ఒక్కో సిలిండర్పై 800 రూపాయల రాయితీ వినియోగదారుడికి లభించనుంది. పెరుగుతున్న ధరలతో సంబంధం లేకుండా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగనుంది. ఇదే స్కీమ్ను అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేక భృతి పథకాన్ని కూడా ప్రకటించారు. అర్హులైన వారికి సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ.3వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రైతుబంధు పథకంపైనా సీఎం కేసీఆర్ మరింత విశాల హృదయంతో స్పందించారు. ఇప్పటికే ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న సర్కార్ దాన్ని దశల వారీగా రూ.16వేలకు పెంచనున్నారు. వచ్చే ఏడాది నుంచి రూ.12వేలతో ప్రారంభించి.. ఏటా వెయ్యి చొప్పున పెంచుతూ రూ.16వేలు అందజేయనున్నారు. దీంతో జిల్లాలో సుమారు 4.90లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో రూ.800 కోట్ల వరకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లు కానుంది.
2014కు ముందు రూ.200 ఉన్న పింఛన్లను దశల వారీగా పెంచుతూ నేడు వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3106 ఇస్తున్నారు. వచ్చే మార్చి తర్వాత రూ.3016, దివ్యాంగులకు రూ.4,516 చేయనున్నారు. ప్రతి ఏటా కొంత మేర పెంచుతూ గరిష్ఠంగా నెలకు రూ.5016, దివ్యాంగులకు 6016 రూపాయలకు పెంచనున్నారు. దీని ద్వారా జిల్లాలో 2.12 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా.
కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో ఆరోగ్యశ్రీ పథకంలో గరిష్ఠ పరిమితిని భారీగా పెంచారు. ప్రస్తుతం రూ.5లక్షలు ఉండగా దాన్ని ఒకేసారి రూ.15లక్షల వరకు పెంచారు. దీంతో అర్హులైన పేదలందరికీ వైద్యపరంగా మరింత మెరుగైన వైద్యసేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే తరహాలో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు ప్రత్యేక ట్రస్టు ద్వారా ఈహెచ్ఎస్ తరహాలో వైద్య సేవలకు భరోసా ఇచ్చారు.
ఇవి కాకుండా జిల్లాలో ఇండ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఇప్పటికే కొనసాగుతున్న గృహాలక్ష్మి పథకం దశల వారీగా అందరికీ అందజేస్తామని ప్రకటించారు. ఇక జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 అగ్రవర్ణ పేదల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు మ్యానిఫెస్టోలో వెల్లడించారు. మహిళా సమాఖ్యల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా జిల్లాలో 660 భవనాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు అసైన్డ్ భూములకు సాధారణ భూముల మాదిరిగానే పట్టాలు వర్తింపజేసేలా, అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించినున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కొనసాగుతున్న అన్ని పథకాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. మ్యానిఫెస్ట్టో విడుదల అంతటా సంబురాలు జరుపుకొన్నారు. చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయగా, మరికొన్ని చోట్ల పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలపై సబ్బండ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మేధావులు ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించడం జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని మాలాంటి పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. మాకు ఇల్లు లేకపోవడంతో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంజూరు పత్రం అందజేశారు. గత పథకాలు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం పేరుతో రూ.3లక్షల ఆర్థిక సాయం చేయడం సంతోషకరం. పేదలకు ఉపయోగపడే ఇలాంటి పథకాలు గతంలో నేను చూడలేదు. నిరుపేదలమంతా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ సారుకు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాం.
– తండు పద్మ, కట్టంగూర్
సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సీపీఎస్పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చేస్తున్న పోరాటానికి స్పందించి సీపీఎస్పై అధ్యయన కమిటీ వేస్తామని వెల్లడించడం సంతోషం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనే పూర్తి స్థాయి విశ్వాసం ఉన్నది. అయితే.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీపీఎస్ రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలి. దీంతో ఉద్యోగులందరిలో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుంది.
– తరాల జగదీశ్, పీఎంటీఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా గతంలో ఎకరానికి రెండు పంటలకు రూ.10వేల పెట్టుబడి సాయం ఇచ్చింది. ఇక నుంచి రూ.16వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషంగా ఉంది. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసిన వ్యక్తి కాబట్టే రైతులకు ఎలాంటి కష్టాలు వస్తాయో ఆయనకు తెలుసు. రైతులకు ఇబ్బందులు, నష్టం రావద్దన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ఇస్తున్నారు. ఇటువంటి సీఎం కేసీఆర్కు రైతాంగం ఎంతో రుణపడి ఉంటుంది.
– మెగావత్ భాష్యానాయక్, రైతు, గాత్తండా, తిరుమలగిరి సాగర్ మండలం
మహిళా సంఘాలకు భవనాలు నిర్మించనున్నట్లు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం. భవనాలు లేకపోవడంతో సమావేశాలు నిర్వహించుకోవడానికి మహిళా సంఘాలకు ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారు.
– పారిజాత, సంఘబంధం అధ్యక్షురాలు, పజ్జూరు, తిప్పర్తి మండలం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో మరోసారి పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన నిలబడ్డది. సంక్షేమం ఉట్టిపడేలా మ్యానిఫెస్టో ఉన్నది. ఆసరా పింఛన్ల పెంపుతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక భద్రత పెరిగింది. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కేసీఆర్ బీమా పథకంతో ప్రతి కుటుంబం ధీమాగా ఉండొచ్చు. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్న పరిస్థితులు కళ్లకు కనబడుతున్నాయి. సన్న బియ్యం పంపిణీ గొప్ప పథకం. గతంలో ఇవ్వని హామీలు కూడా ఇప్పుడు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. కొత్త పథకాలు అమలవుతాయి.
– వల్లపు సైదులు యాదవ్, కొండూరు, మర్రిగూడ మండలం
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చాలా బాగుంది. ముఖ్యంగా మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి నెలా రూ.3వేల భృతి కల్పించడం గొప్ప వరం. మా లాంటి పేదవాళ్లకు సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమానం. గృహలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, స్త్రీనిధి వంటి పథకాలతో మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. సంవత్సరం కిందటే నా బిడ్డ పెండ్లి చేసిన.. నెల తిరుగకుండానే కల్యాణలక్ష్మి చెక్కు ఇచ్చిండ్రు. కేసీఆర్ సారు నా బిడ్డకు మేనమామ అయ్యి.. కట్నం ఇచ్చిండు. ఇప్పటికే మహిళలంతా స్త్రీనిధి ద్వారా ఆయా వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా బలపడుతున్నారు. ఇప్పుడు మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మిస్తామనడం గర్వించదగ్గ విషయం.
– పేరపు రజిత, శివాజీనగర్, నకిరేకల్
గ్యాస్ ధర విపరీతంగా పెరిగి మధ్య తరగతి కుటుంబాలకు పెను భారంగా మారింది. రూ.1200 వరకు పెంచి మళ్లీ కంటితుడుపుగా 200 రూపాయలు తగ్గించినా మాలాంటి కుటుంబాలకు భారంగానే ఉంది. సిలిండర్ కొన్నప్పుడల్లా అంత డబ్బు చెల్లించాలంటే ఇబ్బంది పడుతున్నాం. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో 400 రూపాయలకే గ్యాస్ అందిస్తానని చెప్పడం ఊరట కల్గించింది. రూ.400కే ఇస్తారని నేను ఊహించలేదు. సీఎం కేసీఆర్ ఏది చెప్పినా కచ్చితంగా చేస్తాడు.. చేసేదే చెప్తాడు. ఆయన మాటకు అంత విలువ ఉంది. కేసీఆర్ మాటలను నమ్ముతాం. కేసీఆర్ ఇచ్చిన హామీ గృహిణులకు ఎంతో ఊరట పిచ్చింది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలి.. వస్తడు.
– ఘనపురపు శ్రీలత, గృహిణి, దామరచర్ల