మునుగోడు, నవంబర్ 21 : కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి వేముల లింగస్వామి గౌడ్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న గీతన్నల రణభేరి కరపత్రాన్ని మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కల్లుగీత కార్మికులకు రూ.4 వేలు పింఛన్, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న గీత కార్మికుల ఎక్స్గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భర్త చనిపోయిన గీత కార్మికుడి భార్యకు వెంటనే పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 28న సూర్యాపేటలో నిర్వహించే గీతన్నల రణభేరికి గీత కార్మికులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, వి.ముత్యాలు, అయితగోని మల్లేష్ గౌడ్, బొడ్డు పెద్ద చంద్రమౌళి గౌడ్, కాట్నం అంజయ్య గౌడ్, వేముల వెంకన్న గౌడ్, సీహెచ్ భిక్షం, సైదులు, యాదయ్య పాల్గొన్నారు.