యాదగిరిగుట్ట, నవంబర్ 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో కార్తీక మాసానికి అధికారులు ముస్తాబు చేశారు. సత్యనారాయణ వ్రత మండపం, దీపారాధనకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానాలయ మాఢవీధుల్లో ఈశాన్య ప్రాంతం, శివాలయం మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్లోని క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద, కొండకింద నూతన సత్యనారాయణ వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయం వద్ద దీపారాధనకు స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు దీపారాధన నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో కార్తీక మాసంలో అత్యధిక వ్రతాలు జరుగుతాయని అందుకు అనుగుణంగా సకల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు కొండకింద నూతన ఘాట్ రోడ్డు పక్కన గల నూతన వ్రత మండపంలో కార్తీక మాసాంతం 6 బ్యాచ్లను నిర్వహిస్తామన్నారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27న 8 బ్యాచ్ల్లో వ్రతాలు నిర్వహించనున్నారు. రూ.800 రుసుముతో వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఆలయ అధికారులే సమకూర్చనున్నారు. అందుకు అనుగుణంగా వ్రత మండపాన్ని అధికారులు సిద్ధం చేశారు. పాతగుట్ట ఆలయంలో 5 బ్యాచ్లుగా వత్రాలను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. లక్ష్మీనారసింహుల నిత్య తిరు కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిపించారు.
మొదటగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరు కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం స్వయంభువుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సోమవారం కావడంతో పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు జరిపారు. దీపావళి సందర్భంగా ఆదివారం ఉదయం స్వామి, అమ్మవార్లకు హారతినిచ్చారు. ప్రధానాలయంలో ధనలక్ష్మి పూజ నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి, అమ్మవార్ల అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాలను కలుపుకొని సోమవారం స్వామివారి ఖజానాకు ఆదాయం రూ.33,68,134 సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి తెలిపారు.