మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 6: వైకుంఠం విష్ణు నివాసం. ఎవరు చనిపోయినా అక్కడికి వెళ్లాల్సిందే. ధనిక, పేద తేడా లేకుండా చివరికి వెళ్లాల్సిన ప్రదేశమే వైకుంఠధామం. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో గతంలో దహన సంస్కారాలు చేయాలంటే స్థలం లేని దుస్థితి. దాదాపు 60 ఏండ్లుగా గ్రామంలో ఎవరైనా చనిపోతే దహనం చేయాలంటే స్థలం కూడా కరువే. ఎవరూ స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి ముందుకు వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో స్థల సేకరణ చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో నిధులను మంజూరు చేయించుకొని రూ. 12 లక్షలతో వైకుంఠధామాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. అతి త్వరలో ఎమ్మెల్యే దీనిని ప్రారంభించనున్నారు. ముఖద్వారం, ప్రత్యేక గదులు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక స్నానాల గదులు, మృత దేహాలను కాల్చేందుకు బర్నింగ్ ప్లాంట్లు నిర్మించారు.
ఎమ్మెల్యే సహకారంతో పూర్తి..
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతోనే నిధులు మంజూరయ్యాయి. అందరి సహకారంతో స్థలాన్ని సేకరించాం. వర్షాలు పడ్డాయంటే కాకతీయ కాలువ గట్టున దహన సంస్కారాలు చేయాల్సి వచ్చేది.
-సర్పంచ్, రామంచ గోపాల్ రెడ్డి
మండలంలోనే మోడల్గా ..
మండలంలోనే వైకుంఠధామం మోడల్గా నిలువనుంది. సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి అధికారుల చుట్టూ తిరిగి స్థలాన్ని సేకరించి నిర్మాణ పనులు చేయించారు. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
-దివ్యదర్శన్ రావు, ఎంపీడీవో
ఎన్నో ఏండ్ల గోస తీరింది
ఏండ్ల నుంచి గ్రామంలో వైకుంఠధామం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే వైకుంఠధామాన్ని పూర్తి చేశారు. పాలక వర్గం, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. మహిళల కోసం ప్రత్యేక గదులు నిర్మించారు.
– గాజర్ల రాధ, వార్డు సభ్యురాలు