నీలగిరి, మార్చి 21 : నల్లగొండ జిల్లాలో కంటి వెలుగు 54.8 శాతం మందికి అందింది. ఉచిత కంటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండగా ప్రజలు కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వైద్యులు కూడా ఓపికతో సేవలందిస్తుండగా సబ్బండవర్గాలు సంబురపడుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమై 44 రోజులు పూర్తి కాగా జిల్లాలో 3,841 గ్రామాల్లో, 90 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి శారు. మరో 56 గ్రామాల్లో, 18 వార్డుల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3,97,538 మందికి పరీక్షలు చేయగా 76,751 మందికిపైగా కళ్లద్దాలు అందించారు. మరో 23,576 మందికి ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. మరో 1,00,278 మందికి ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు.
అంధత్వ నివారణే ధ్యేయంగా..
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సంబంధిత వ్యాధులతో బాధపడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగులు కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. గతంలోనే తొలి విడుత కంటి పరీక్షలు నిర్వహించగా రెండో సారి ఈ ఏడాది జనవరి 19న ప్రారంభమైంది. జిల్లాలో 74 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొంతమేర ఆర్థికంగా ఉన్న వారు కంటి సమస్యలపై ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తుండగా.. పేద, మధ్యతరగతి వారు మాత్రం సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగులు కార్యక్రమం ఆయా వర్గాలకు వరంగా మారింది. వైద్య బృందాలు ఏరోజు ఎక్కడ పరీక్షలు చేస్తారనే విషయం ముందస్తుగానే ప్రకటించడం, ఆయా గ్రామాల్లో ఒక రోజు ముందే డప్పు చాటింపు చేస్తుండడంతో ప్రజలు తరలి వస్తున్నారు. కంటివెలుగు కేంద్రాల్లో అత్యంత అధునాతన మిషనరీతో పరీక్షలు చేస్తున్నారు. మంచి కళ్లజోళ్లు, మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. దాంతో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
వైద్య శిబిరాలకు విశేష స్పందన..
కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రజలు అధికమంది కంటి వెలుగు కేంద్రాలకు తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాలోని 74 కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 3,97,538 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 1,92,420 మంది పురుషులు, 2,04,945 మంది స్త్రీలు, 173 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 71,471 మంది ఎస్సీలు, 49,406 మంది గిరిజనులు, 6,029 మైనార్టీలు, 2,28,793 మంది బీసీలు, ఇతర కులాలకు చెందిన వారు 41,839 మంది ఉన్నారు.
కంటి సమస్యలు అధికం
జిల్లాలో 44 రోజులుగా 3,97,538 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 1,00,327మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 76,751మందికి దగ్గర, దూరం చూపుల్లో సమస్య ఉన్నట్లు గుర్తించి వెంటనే కళ్లద్దాలు అందించారు. రెండు కండ్లల్లో సమస్యలు వేర్వేరుగా ఉంటే ప్రత్యేకంగా హైదరాబాద్లో కళ్లద్దాలు తయారు చేయించి ఇస్తున్నారు. ఇప్పటి వరకు17,630 మందికి ప్రత్యేకంగా తయారు చేసిన అద్దాలను అందజేయగా మరో 23,576 మందికి ఆర్డర్ చేశారు.
384 గ్రామాలు, 90 వార్డుల్లో పూర్తి
జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ సెలవు దినాలు మినహా మిగతా 44 రోజులు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో విజయవంతంగా పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో 60 టీమ్లు ఏర్పాటు చేసి అదనంగా మరో టీమ్ను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. ఈ టీమ్లు ఇప్పటి వరకు 384 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేయగా మరో 56 గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 14 టీమ్లను ఏర్పాటు చేయగా 90 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేసి మరో 18 వార్డుల్లో కొనసాగిస్తున్నారు.