యాసంగి పంటల సాగు కోసం కాళేశ్వరం జలాలను వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో జనవరి 8నుంచి మార్చి 30వ తేదీ వరకు కొనసాగే నీటి విడుదల షెడ్యూల్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 4వేల క్యూసెక్కుల చొప్పున 6 విడుతల్లో 48రోజులు నీటి విడుదల చేయనున్నారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. గతేడాది యాసంగి సాగుకు ప్రభుత్వం జనవరి 8నుంచి ఏప్రిల్ 15వరకు 56రోజులపాటు సాగునీరు అందించింది.
ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాల్వలతో మూడేండ్లుగా నిరంతరాయంగా కాళేశ్వరం జలాలు అందిస్తుండడంతో కరువు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. బీడు భూముల్లో పచ్చని పొలాలుగా మారాయి. తిరుమలగిరి మండలంలోని వెలిశాల 69 డీబీఎం నుంచి తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు.. 70డీబీఎం కాల్వ ద్వారా నాగారం మండలం 71డీబీఎంతో నాగారం, అర్వపల్లి మండలాలతో పాటు సూర్యాపేట నియోజక వర్గంలోని ఆత్మకూర్ ఎస్, చివ్వెంల, పెన్పహాడ్, మండలాలతో పాటు కోదాడ నియోజక వర్గంలోని మోతె, నడిగూడం మండలాల్లో ని పలు గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి.
వానకాలం ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలతో ఇప్పటికే నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. భూగర్భ జలాలు విపరీతంగా పెరగడంతో 30నుంచి 40ఫీట్లలోనే నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి. బోర్లలో నిండుగా నీళ్లు ఉండడంతో ఇప్పటికే రైతులు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. యాసంగి నీటి విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వారబందీ విధానంలో కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాకు రానున్నాయి. జనవరి 8నుంచి 16వరకు నీరందించి అనంతరం 15రోజుల పాటు నిలిపివేస్తారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజక వర్గాల్లో రెండో దశ కింద 2,23,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్లో పూర్తి ఆయకుట్టుకు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. సాగు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.