చందంపేట(దేవరకొండ)/ గుడిపల్లి ఆగస్టు 21 : ఆంధ్ర సీఎం చంద్రబాబు మెప్పు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పోతిరెడ్డిపాడుకు నీరు తరలించుకుపోతూ సాగర్కు చుక్క నీరు రాకుండా కుటీల ప్రయత్నాలకు పాల్పడుతున్నారని, దీంతో ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నాగార్జున సాగర్ను నింపి ఏఎమ్మార్పీ ద్వారా చెరువులు, కుంటలు నింపి ఇక్కడి రైతాంగానికి సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోదాడ-జాతీయ రహదారిపై గణపురం స్టేజీ సమీపంలోని ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ గేట్ల వద్ద నిర్వహించిన ధర్నాలో రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇతర రాష్ర్టాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్రోహమన్నారు. సుమారు 25 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తూ సాగర్కు నీరు రాకుండా అడ్డుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదికి సమృద్ధిగా నీరు వస్తున్నా రైతులకు సాగునీరివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సాగర్లో నీరున్నా రైతులకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే రెండు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఏఎమ్మార్పీ రిజర్వాయర్ నీటితో ముందుగా గుడిపల్లి, పీఏపల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నాతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామైంది. దీంతో పోలీసులు సర్దిచెప్పి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్, మండల అధ్యక్షుడు వెల్గూరి వల్లపురెడ్డి, నాయకులు కటికనేని మాధవరావు, తోటకూరి పరమేష్, మాద సుధాకర్గౌడ్, సర్పంచులు కున్రెడ్డి రాజశేఖర్రెడ్డి, రాయినబోయిన శ్రీను, నగేష్, రమావత్ కిషన్, అర్వపల్లి నర్సింహా, బొడ్డుపల్లి మహేందర్, దీపావత్ నరేందర్, ఎర్ర యాదగిరి, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.