సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉన్నారు. కానీ, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. పైగా ఇక్కడ జరిగిన రక్తపాతం రాష్ట్రంలోనే మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఏ గ్రామానికి వెళ్లినా ఊరుకు ముందు రోడ్డుకు ఇరువైపులా ఆయా రాజకీయ పార్టీల హత్యాకాండలకు ఆనవాళ్లుగా స్మారక స్తూపాలు దర్శనమిస్తుంటాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకురాలేని నాటి నేతలు జనం మధ్య రాజకీయ చిచ్చుపెట్టి తమ వెంట తిప్పుకున్నారు తప్ప జనానికి చేసిన మేలేమీ లేదు. పోరాడి సాధించుకున్న స్వరాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంత కృషి చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఘర్షణలు, కొట్లాటలకు తావివ్వకుండా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తుండడంతో నేడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. 2014కు ముందు ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక కరువు ప్రాంతం. 2014 ముందు నుంచి 2017 యాసంగి వరకు నియోజకవర్గంలో 17,620 ఎకరాల్లో వరి సాగు కాగా, నేడు 1,12,210 ఎకరాల్లో వరి సాగవుతుందంటే నాటి, నేటి పరిస్థితి ఏ స్థాయిలో మారిందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తొలి ఫలితం ఈ నియోకవర్గానికే దక్కడం గమనార్హం. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయిస్తుంటే జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కాల్వల వెంట తిరిగి మరమ్మతులు చేయించడంతో గోదావరి జలాలు చివరి ఆయకట్టు వరకూ సరఫరా అవుతున్నవి. దాంతో వ్యవసాయం పండుగలా మారడమే కాకుండా ఎమ్మెల్యే కిశోర్ నేతృత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్నాయి.
దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్లో తిరుమలగిరికి చోటు..
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం చేపట్టగా పైలెట్ ప్రాజెక్ట్గా తిరుమలగిరి మండలానికి చోటు దక్కడం గమనార్హం. వెనుకబాటుకు గురైన ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యే గాదరి కిశోర్ చొరవ తీసుకోవడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుమలగిరి మండలంలో 2,223 మందిని దళిత బంధుకు ఎంపిక చేశారు. ఇందులో మున్సిపాలిటీ పరిధిలో 1,140 మంది ఉండగా, మండలంలో 1,083 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి యూనిట్లు అందజేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసింది. బీదరికపు జీవితాలను నెట్టుకొస్తున్న దళితులు వాటికి స్వస్తి పలికి ఈ నిధులతో ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకెళ్తున్నారు.
వేలల్లో నుంచి లక్షల్లోకి భూముల ధరలు
2014కు ముందు నియోజకవర్గ పరిధిలో సాగునీరు లేకపోవడంతో వ్యవసాయ భూములు పాడువుబడి ఉండేవి. అలాంటి భూములకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు రావడంతో నేడు సస్యశ్యామలమయ్యాయి. నాడు ఎకరా ఒక్కంటికి రూ.25 వేల నుంచి లక్ష కూడా పలకలేదు. ఎవరైనా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా.. నీళ్లు లేని భూములను ఏం చేసుకోవాలని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేది కాదు. భూములు కొనేవారు లేకపోవడంతో ఆసుపత్రి ఖర్చులు, ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఏడాదంతా పనులు లేక కడుపు నింపుకునేందుకు చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఉన్న పశువులు, ఒంటిమీది బంగారం అమ్ముకున్న సంఘటనలు కూడా అనేకం ఉండేది. అలాంటిది నేడు నియోజకవర్గంలో ఎకరా ఒక్కంటికి రూ.25 లక్షల నుంచి 40 లక్షల వరకు ధర పలుకడం గమనార్హం.
ఈ సంతృప్తికి జీవితకాలం సరిపోదు
గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాల తరబడి కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమా అని సస్యశ్యామలంగా మారింది. పచ్చని పైర్లు పండుతున్నాయి. ఈ తొమ్మిదేండ్లలో నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెంది గతాన్ని ప్రస్తుతంతో పోల్చుకుంటూ ప్రజలు సంతోషంగా ఉండడంపై వస్తున్న సంతృప్తికి ఈ జీవితకాలం సరిపోదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి ఏది కావాలన్నా ఇస్తున్నరు. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పటికే కళకళలాడుతున్న తుంగతుర్తి నియోకవర్గాన్ని రానున్న రోజుల్లో అందరి సహకారంతో రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
-గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
నాడు కూలీని.. నేడు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నా
మాది తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామం. గతంలో నేను ఇతరుల దగ్గర కూలీ పని చేసేవాన్ని. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో మా ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నాకు పది లక్షల రూపాయలు ఇప్పించారు. వాటితో నేను సెంట్రింగ్ వ్యాపారం ఎంచుకున్నా. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నా. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తుండడం సంతోషంగా ఉంది.
-దంతాలపల్లి సోమయ్య, దళితబంధు లబ్ధిదారుడు, మామిడాల
ఎమ్మెల్యే కిశోర్ ఎంతో అభివృద్ధి చేస్తుండు
ఎమ్మెల్యేగా గాదరి కిశోర్ వచ్చిన కాన్నుంచి నియోజకవర్గంలో గొడవలు, కొట్లాటలు లేవు. నియెజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా మాలాంటి రైతులు గర్వంగా తలెత్తుకునేలా గోదావరి నీళ్లు వచ్చినయి. రైతుబంధు పథకం రైతులకు కల్పతరువుగా మారింది. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు ఎవరి వద్ద చేయి చాచావద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఎకరాకు ఐదు వేల చొప్పున ఏడాదికి పది వేలు ఇస్తున్నరు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కిశోర్కు రైతులంతా రుణపడి ఉంటరు.
-రామసాయం జనార్దన్రెడ్డి, రైతు, బిక్కుమళ్ల
ధాన్యం దిగుబడి పెరుగడంతో గోదాముల నిర్మాణం
గతంలో నీళ్లు లేక ధాన్యం పండించలేని రైతాంగానికి గోదాముల అవసరం పడ లేదు. ఒకవేళ నాడు గోదాములు కావాలనుకున్న రైతులకు అప్పటి నేతలు వాటిని నిర్మించాలన్న ఆలోచన చేయలేదు. కానీ, కాళేశ్వరం జలాలతో వరి ధాన్యం దిగుబడి అమాంతం పెరుగడంతో ఎమ్మెల్యే గాదరి కిశోర్ చొరవతో రూ.12 కోట్లతో గోదాముల నిర్మాణాలు జరిగాయి. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, అడ్డగూడూరు, మోత్కూర్ మండలాల్లో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించారు.
ఐదేండ్లలో 5,863 కోట్ల వరి దిగుబడి
కాళేశ్వరం జలాలు తరలిరావడంతో గత ఐదేండ్లలో రైతులు పండించిన ధాన్యం విలువ సుమారు 5,863 కోట్లు కావడం గమనార్హం. నియోజకవర్గంలో 1,41,265 ఎకరాల సాగు భూమి ఉండగా 2018కు ముందు వరకు 17వేల ఎకరాలకు మించి వరి సాగవలేదు. తదనంతరం వరుసగా దాదాపు 1.12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఎకరాకు తక్కువలో తక్కువ 25 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. కాగా 2018లో ధాన్యానికి ఎంఎస్పీ క్వింటాకు రూ.1,815 ఉండగా, నేడు రూ.2,040 ఉంది. సగటున క్వింటా ఒక్కంటికి రూ.1900 ఉండగా ఒక సీజన్లో పండే పంట విలువ 532.99 కోట్లు కాగా, 2017-18 నుంచి 2023 యాసంగి వరకు తొమ్మిది సీజన్లలో రెండు పంటల చొప్పున నియోజకవర్గ రైతులకు దాదాపు 5,863 కోట్ల రూపాయల పంట పండింది.
ఆపదలో ఉన్నవారికి ఆర్థిక చేయూత
నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అంతేకాకుండా అన్నా.. నాకు ఆపద ఉందంటూ వచ్చే సామాన్యులకే కాదు, విపక్షాలకు చెందిన వారికి కూడా తోచినంతలో ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నాడని పలువురు సంతోషం వెలిబుచ్చుతున్నారు.
మిషన్ భగీరథ తొలి ఫలితం ఇక్కడే
నియోజకవర్గంలో రూ.200 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తుండడం జిల్లాలోనే తొలి ఫలితం ఇక్కడే దక్కడం గమనార్హం. జనగామ జిల్లా సింగరాజుపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీటిని పంపింగ్ చేసే పైపులైన్ ద్వారా తిరుమలగిరి మండలానికి గోదావరి జలాలు అందిస్తుండగా.. తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాలకు పాలేరు నుంచి కృష్ణాజలాలు అందిస్తున్నారు. అలాగే మోత్కూర్, శాలిగౌరారం, అడ్డగూడూరు మండలాలకు ఉదయ సముద్రం నుంచి కృష్జా జలాలు అందించి ప్రజల దాహార్తిని తీర్చుతున్నారు.
పురాతన ఆలయాలకు పూర్వవైభవం
సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి. అర్వపల్లి మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే కిశోర్కుమార్ రూ.6.20 లక్షలు మంజూరు చేయించారు. అలాగే నాగారం మండలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలోని కోనేరు సుందరీకరణకు రూ.22 లక్షలు కేటాయించారు. గతంలో కనీసం పట్టించుకోని చారిత్రాత్మక ఫణిగిరి బౌద్ధక్షేత్రం ప్రహరీ, తవ్వకాలకు రూ.50 లక్షలు తీసుకొచ్చారు. ఇక రెండో భద్రాద్రిగా పేరున్న నూతనకల్ మండలం మిర్యాలలోని సీతారామచంద్ర ఆలయాన్ని రూ.16 లక్షలతో అందంగా తీర్చిదిద్దారు.
5,402 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గాదరి కిశోర్కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల విలువ దాదాపు 5,402 కోట్లు. గత ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోక నియోజకవర్గంలో ఉన్న మొత్తం భూమిలో 20 శాతానికి మించి సాగుకు నోచుకోకపోగా నేడు కాళేశ్వరం జలాలతో దాదాపు వందశాతం సాగులోకి వచ్చింది. నియోజకవర్గంలో 1,41,265 ఎకరాల సాగు భూమి ఉండగా కాళేశ్వరం జలాలు రావడం, మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడడం, 59.01 కోట్లతో చెక్ డ్యామ్ల నిర్మాణాలు, 12 కోట్లతో శ్రీరాంసాగర్ కాల్వల ఆధునీకరణ, 4 కోట్లతో తూముల నిర్మాణాలు, 65 లక్షలతో కాల్వల్లో కంపచెట్ల తొలగింపుతో నేడు 1,12,210 ఎకరాల్లో వరి పంట పండుతుండగా మిగిలిన భూముల్లో ఇతర పంటలు పండుతున్నాయి. అలాగే 19.40 కోట్లతో 385 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, రూ.7.50 కోట్లతో శాలిగౌరారం ప్రాజెక్ట్ మరమ్మతులు, రూ.4.80కోట్లతో మోత్కూర్ మినీ ట్యాంక్బండ్ నిర్మాణం, రూ.18 కోట్లతో గురజాల మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం, రూ.3 కోట్లతో మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు, రూ.27.25 కోట్లతో నియోజకవర్గంలో అవసరమున్న ప్రతిచోట బ్రిడ్జిల నిర్మాణ పనులు, 3 కోట్లతో తిరుమలగిరిలో పాలిటెక్నికల్ కళాశాల భవనం, రూ. 2 కోట్లతో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.30 కోట్లు, రూ.1.55 కోట్లతో అర్వపల్లిలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు, రూ.5.50 కోట్లతో ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుతోపాటు వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.