యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న పలువురు
బాంబుల దాడి నేపథ్యంలో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడి
నీళ్లు, ఆహారానికి కొరత ఏర్పడుతున్నదని ఆవేదన
ఫోన్లో తల్లిదండ్రులకు క్షేమ సమాచారం
వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావాలని ప్రాధేయపడుతున్న పేరెంట్స్
యాదాద్రి/వలిగొండ/సంస్థాన్నారాణపురం/రాజాపేట, ఫిబ్రవరి 26;ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా సైనిక దాడి ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడ్రోజులుగా యుద్ధం సాగుతుండడం, బాంబుల వర్షం కురుస్తుండడంతో ఊపిరి బిగపట్టి కాలం గడుపుతున్నారు. వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు వెళ్లిన యాదాద్రి భువనగిరి,
నల్లగొండ జిల్లాలకు చెందిన విద్యార్థులు పలువురు వార్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సంస్థాన్నారాయణపురం మండలంలోని డాకుతండాకు చెందిన కరంటోతు హర్ష రాథోడ్, నకిరేకల్వాసి రాసమళ్ల శరత్, యాదగిరిగుట్టకు చెందిన గంజి భానుప్రసాద్, ముడుంబై ఆచార్య శేష ఫణిచంద్ర, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామస్తుడు హరితేజ, చెందిన గోలి జాన్సన్, రాజకుమారి ఇలా ఆగిపోయినవారే. వారి రాక కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాము ఉండే ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నదని, బంకర్లలో తలదాచుకుంటున్నామని విద్యార్థులు చెప్తున్నారు. నమస్తే తెలంగాణ బృందం ఫోన్లో సంప్రదించగా.. నీళ్లు, ఆహారం కూడా సరిపడా దొరకడం లేదని వాపోయారు. సాధ్యమైనంత త్వరగా తమను ఇండియాకు తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని చేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అక్కడ కర్ఫ్యూ విధించగా.. విన్నిస్టియా, జఫ్రోజియా వైద్య యూనివర్సిటీల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో పలువురు బంకర్లలో తలదాచుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాం.. అప్పుడప్పుడు బాంబుల శబ్దాలు వినిపిస్తుండడం భయాందోళన కలిగిస్తుంది.. ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారు.. రోడ్డు మార్గంలో సరిహద్దు దేశమైన రుమేనియాకు తరలించి తిరిగి అక్కడి నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు.’ అని తెలిపారు. రెండు మూడ్రోజుల్లో స్వదేశానికి చేరుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా ఇబ్బందికరంగా ఉంది…
తిప్పర్తి, ఫిబ్రవరి 26: యుద్ధం వల్ల తాము ఉక్రెయిన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన గోలి కొండల్ రావు, నిరీక్షణ దంపతుల కుమారుడు, కూతురు జాన్సన్, రాజకుమారి తెలిపారు. వీరు ఉక్రెయిన్లోని ఇవానో పట్టణంలో ఉంటూ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 24న తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో బాంబులు పడ్డాయని, భయంకర వాతావరణం కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటి సరఫరా సరిగా లేదన్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు బస్సు ద్వారా సమీప దేశానికి తరలిస్తున్నారని, ఇంకా తమ సీరియల్ రాలేదన్నారు. రోజూ మూడు బస్సుల్లో తరలిస్తున్నారని, తమ సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని వాపోయారు. తమ పిల్లలను త్వరగా స్వదేశానికి తీసుకురావాలంటూ తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండ్రోజులుగా బంకర్లోనే..రఘునాథపురం విద్యార్థి కుడుదుల హరితేజ
రాజాపేట, ఫిబ్రవరి 26 : మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన కుడుదుల యాదగిరి, యోగేశ్వరి కుమారుడు హరితేజ ఉక్రెయిన్ దేశంలోని విన్నిస్టియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో వీడియో కాల్లో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరించాడు. ‘దాడులు జరిగే ప్రాంతానికి మేము 200కిలో మీటర్ల దూరంలో ఉంటున్నాం. రెండ్రోజుల ముందు సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పడంతో సమీప రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. కానీ, మరో రోజు పంపిస్తామని చెప్పడంతో తిరిగి హాస్టల్కు చేరుకున్నాం. మొదటి సైరన్ మోగిన వెంటనే హాస్టల్ బేస్మెంట్ బంకర్లలోకి వెళ్లాలని ఇక్కడి అధికారులు ఆదేశించడంతో రెండ్రోజులుగా బంకర్లలోనే తలదాచుకుంటున్నాం. తెల్లవారుజామున మాకు నాలుగు కిలోమీటర్ల దూరంలో మూడు మిసైల్స్ పడి పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యాను. దాడులు ప్రారంభమైన రోజు నుంచి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. ప్రస్తుతానికి అందరం క్షేమంగానే ఉన్నాం.’ అని వివరాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఇండియాకు రప్పించేలా చర్యలు
తీసుకోవాలని వేడుకున్నాడు.
తినడానికి ఏమీ దొరుకట్లేదు..
సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 26 : సంస్థాన్ నారాయణపురం మండలం డాకుతండాకు చెందిన కరంటోతు లచ్చీరాం నాయక్ ధనమ్మ దంపతులు కుమారుడు కరంటోతు హర్ష రాథోడ్ ఉక్రెయిన్లో చిక్కుకున్నాడు. కొద్ది రోజుల కిందటే జఫ్రోజియా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న హర్ష.. అక్కడి యుద్ధ వాతావరణంతో ఆందోళనకు గురవుతున్నాడు. శనివారం నమస్తే తెలంగాణతో ఫోన్లో మాట్లాడుతూ 10రోజుల కిందటే ఉక్రెయిన్కు వచ్చానని తెలిపాడు. బాంబులు, తుపాకుల శబ్దాలతో భయంగా ఉన్నదని వాపోయాడు. రెండ్రోజులుగా రాత్రి సమయంలో 200మంది విద్యార్థులం బంకర్లో తలదాచుకుంటున్నామని, ఉదయం హాస్టల్కు వస్తున్నామని తెలిపాడు. మాల్స్ మూసేయడంతో తినడానికి ఏమీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కంచనపల్లిలో శాంతిర్యాలీ
వలిగొండ, ఫిబ్రవరి 26 : ఉక్రెయిన్ దేశంపై రష్యా సేనల దాడిని ఖండిస్తూ మండలంలోని కంచనపల్లిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సామాజిక సేవ కార్యకర్త కూసు వేణురెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూసు వేణురెడ్డి మాట్లాడుతూ యుద్ధం అనే అమానవీయ దాడులను శాంతి సంస్థలు అడ్డుకోవాలని, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలన్నారు. యుద్ధం వద్దు.. శాంతి వర్థిల్లాలని విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు దొడ్డి భిక్షపతి, నిమ్మారెడ్డి లక్ష్మీకాంత్రెడ్డి, ఎడమ రాఘవేందర్రెడ్డి, పన్నాల మల్లారెడ్డి, జక్క వెంకట్రెడ్డి, నర్సిరెడ్డి, ముత్యంరెడ్డి, జంగారెడి పాల్గొన్నారు.
భయంగా ఉంది..
కట్టంగూర్(నకిరేకల్), ఫిబ్రవరి 26 : మమ్మీ, డాడీ నాకు భయంగా ఉంది. బంకర్లో ఉన్నాం. బాంబుల మోత, పొగలు కమ్ముకుంటున్నాయి అని నకిరేకల్కు చెందిన వైద్య విద్యార్థి రాసమళ్ల శరత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీవ్ నగరంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న శరత్ తల్లిదండ్రులు సైదులు, లక్ష్మిని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం వారి నివాసంలో కలిసి మాట్లాడారు. శరత్తో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రంతో మాట్లాడుతున్నారని, ఇండియాకు రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారని ధైర్యం చెప్పారు.