సూర్యాపేట టౌన్, అక్టోబర్ 26 : అమిత్షా పర్యటన వేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని తన నివాసంలో పలువురు మహిళలతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయను గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికిన మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అయోధ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరడం సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు. అభివృద్ధికి మద్దతుగా బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. సూర్యాపేట అభివృద్ధి ఘనత ముమ్మాటికీ మంత్రి జగదీశ్రెడ్డిదే అన్నారు. జగదీశ్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. జగదీశ్రెడ్డి గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్న జగదీశ్రెడ్డికి పార్టీలకతీతంగా అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని బొప్పారం బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలేటి భిక్షంరెడ్డితోపాటు 20 మంది నెమ్మికల్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, బత్తుల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.