పాలకవీడు, జనవరి 26 : మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గా ఉర్సు జన జాతరను తలపిస్తున్నది. ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం గంధోత్సవం (ఉర్సే షరీఫ్) ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన గంధాన్ని ఫకీర్ల ఖవ్వాలీ, మేళతాళాలతో జాన్పహాడ్ దర్గా గ్రామంలోని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని చందల్ ఖానాలో ఉంచారు. మరోవైపు దర్గా ముజావర్ సయ్యద్ జానీ ఇంటి నుంచి గుర్రాలపై తీసుకొచ్చిన గంధాన్ని చందల్ఖానాలో గల గంధంతో కలిపారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ గంధాన్ని ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. దర్గాలో సైదులు బాబా సమాధులపై చాదర్ను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాన్పహాడ్ దర్గా ప్రధాన వీధుల్లో పోలీసు బందోబస్తుతో కల్మటితండా, జాన్పహాడ్ గ్రామాల్లో ఆరు గంటల పాటు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం అందుకోవడానికి భక్తులు పోటీపడగా.. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అనంతరం దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్షా, జాన్పాక్ సయ్యద్ రహమతుల్లా సమాధుల మీదికి ఎక్కించారు.
సైదన్న ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దర్గా పరిసరాలు కిటకిటలాడాయి. సఫాయి బావి వద్ద, మహంకాళీగూడెం పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్గా వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎస్పీ రాహుల్హెగ్డే పర్యవేక్షణలో డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. కోదాడ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల నుంచి 50 బస్సులు నడిపారు.
సైదన్న ఉర్సుకు కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే, ట్రైనీ ఎస్పీ రాజేశ్ మీనన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, డీఎస్పీ ప్రకాశ్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ గోపాల్, జడ్పీటీసీ మాలోతు బుజ్జి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జాన్పహాడ్ దర్గా అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గంధం ఊరేగింపును ప్రారంభించిన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతుందని.. కాంగ్రెస్కు, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ నీటిని త్వరలోనే విడుదల చేస్తామని, నియోజకవర్గంలో అవసరమైన మేర లిఫ్ట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.