తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మూడ్రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు, దర్గా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదికోసారి జనవరి చివరి వారంలో జరిగే సైదన్న జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్బోర్డు రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నాయి. దర్గాను రంగురంగులతో అలంకరిస్తున్నారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
– పాలకవీడు, జనవరి 22
జాతరకు చురుగ్గా ఏర్పాట్లు
దర్గా వద్దకు వచ్చే భక్తుల సదుపాయాల కోసం రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితోపాటు, దక్కన్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యం మంచినీటి ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యారోగ్యం, పోలీస్, ఆర్టీసీ, అగ్నిమాపక, 108 సిబ్బంది, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు హుజూర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. సీఐ రామలింగారెడ్డి, తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ వెంకటాచారి, ఎస్ఐ సైదులుగౌడ్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. దర్గా వద్ద భక్తులను నియంత్రించడానికి దర్గా ఎదుట, లోపల ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. శూన్యపహాడ్ రహదారి వెంట, జాన్పహాడ్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలను డోజర్లు, జేసీబీలతో చదును చేస్తున్నారు.
మూడ్రోజుల ఉత్సవం
సైదన్న దర్గా ఉత్సవాలు మూడ్రోజులపాటు జరుగనున్నాయి. ఈ నెల 26న గుసూల్ షరీఫ్లో భాగంగా ఉదయం సైదులు బాబా సమాధులపై ఉన్న పాత చాదర్లను తొలగించి సమాధులను శుభ్రం చేస్తారు. వాటి చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి పత్య్రేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం సైదులు బాబా సమాధులపై దట్టీలను ఉంచి పూలతో అలంకరించి ఉర్సు ప్రారంభిస్తారు. 27న గంధోత్సవం, 28న ప్రత్యేక దీపారాధనతో ఉత్సవాలు ముగిస్తారు.
ప్రముఖులకు ఆహ్వానాలు
దర్గా ఉర్సుకు హాజరు కావాలని కోరుతూ వక్ఫ్ బోర్డు అధికారులు, దర్గా ముజావర్ జానీబాబా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఆహ్వానం అందించారు.