జాన్పహాడ్ దర్గా సైదులు బాబా ఉర్సు గురువారం షురూ అయ్యింది. మూడ్రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గుసూల్ షరీఫ్ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దర్గా ముజావర్ ఇంటినుంచి గంధం కలశాలు, దట్టీలను ఊరేగింపుగా తీసుకొచ్చి వాటితో దర్గాలోని సమాధులను అలంకరించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం నేడు గంధోత్సవం (ఉర్సే షరీఫ్)ను వైభవంగా జరిపించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు.
– పాలకవీడు, జనవరి 26
పాలకవీడు, జనవరి 26 : రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న జాన్పహాడ్ దర్గా వద్ద సైదులు బాబా ఉర్సు గురువారం సంప్రదాయ బద్ధంగా వైభవోపేతంగా ప్రారంభమైంది. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వేకువజామునే దర్గా ముజావర్ సయ్యద్ జానీ గృహం నుంచి మేళతాళాలతో గంధ కలశాలను, దట్టీలను ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా జాన్పాక్ షహీద్ రహమతుల్లా అలై సమాధులతో పాటు వెలుపల ఉన్న సైనిక బృందాల సమాధులపై (సిపాయిలు) గంధం చల్లి, పూలమాలలు, దట్టీలతో అలంకరించారు.
సమాధుల చుట్టూ మహిళలు కొవ్వొత్తులను వెలిగించి పూజలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తొలి రోజు మగ్రీబ్, ఈషాద్ నమాజ్లను దర్గా ముజావర్లు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గాకు వచ్చిన భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలో గల నాగదేవతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉర్సు సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో పరిసర ప్రాంతాలు, వీధులు ముస్తాబయ్యాయి.
పటిష్ట బందోబస్తు
సైదన్న ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపునకు శుక్రవారం భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ గురువారం జాన్పహాడ్ దర్గాలో బందోబస్తును పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేరేడుచర్ల నుంచి వచ్చే వాహనాలను జాన్పహాడ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, దామరచర్ల నుంచి వచ్చే వాహనాలను శూన్యపహాడ్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద, దక్కన్ సిమెంట్ కార్మాగారం నుంచి వచ్చే వాహనాలు రావిపహాడ్ గ్రామానికి వెళ్లే దారిలో నిలిపివేయడానికి పోలీసు శాఖ ఏర్పాటు చేసిన పార్కింగ్లను ఆయన పరిశీలించారు.
అనంతరం జేపీఎస్ ఫంక్షన్హాల్లో పోలీసు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. దర్గా పరిసర ప్రాంతంలో తాత్కాలిక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలతో నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 410 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
దర్గా ఆవరణలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. దర్గా వర్క్ ఇన్స్పెక్టర్ మహుమూద్, దక్కన్, పెన్నా సిమెంట్ యాజమాన్యాలు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. దర్గా పరిసరాల్లో దుమ్ము లేవకుండా ట్యాంకులతో వీధుల్లో నీటిని చల్లారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతను చేపట్టాయి. దర్గా పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాయి. ఆర్టీసీ కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి వయా దామరచర్ల, నేరేడుచర్ల మీదుగా 30కి పైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
నేడు గంధోత్సవం
సైదన్న ఉత్సవాల్లో అతి ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపు (ఉర్సే షరీఫ్) రెండో రోజు శుక్రవారం నిర్వహించనున్నారు. గంధం ఊరేగింపునకు రాష్ట్రం నలుమూలల నుంచి గురువారం రాత్రే భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అందుకు తగ్గట్లుగా వక్ఫ్బోరు,్డ స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉర్సు సందర్భంగా తెలంగాణ, ఆంధ్రాలోని వివిధ పట్టణాలకు చెందిన పక్కీర్లు పెద్ద సంఖ్యలో జాన్పహాడ్కు తరలివచ్చారు. ఉర్సు ఉత్సవాల ప్రారంభం నుంచి దర్గా లోపల, బయట పక్కీర్లు నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం అలరించింది. దట్టీ ఊరేగింపులో, ఉర్సులో వీరి సందడి ప్రత్యేకంగా కనిపించింది.